అచ్యుతాపురం రూరల్ : అతిగా మద్యం తాగి వికాష్ కుష్వా (26) అనే యువకుడు మృతి చెందిన ఘటన చీమలాపల్లి రెవెన్యూ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలి ఇలా ఉన్నాయి. వికాష్ కుష్వా మడుతూరు కూడలిలో ఉన్న మై చాయిస్ ఐస్ క్రీమ్ కంపెనీలో రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11 తేదీన విధులు ముగించుకుని దగ్గర్లో ఉన్న మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి, అతిగా మద్యం తాగాడు. శివ ప్రియా గార్డెన్స్ వద్ద మృతదేహం ఉన్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం వెళ్లి పరిశీంచి, మృతి చెందిన వ్యక్తి వికాష్ కుష్వాగా గుర్తించారు. ఎక్కువగా మద్యం తాగడం వల్లే మృతి చెంది ఉంటాడని ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేస్తున్నట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు.


