ఉపాధ్యాయ సమస్యలపై 10న చలో కలెక్టరేట్
చోడవరం: ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా చోడవరం తహసీల్దార్కు శుక్రవారం యూనియన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని బకాయిలు చెల్లిస్తామని వాగ్దానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకూ 12వ పీఆర్సీ కమిషన్ను వేయలేదని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఏపీఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. దశలవారీ ఆందోళనలో భాగంగా వచ్చే నెల 10న జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా, 25న చలో విజయవాడ కార్యక్రమాలు నిర్వహిస్తామని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఐ.వి రామిరెడ్డి, కె.పరదేశి తెలిపారు. ఈ ఆందోళనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ పాల్గొనాలన్నారు.


