లోక్ అదాలత్తో సత్వర న్యాయం
విశాఖ లీగల్ : రాజీమార్గమే రాజమార్గమని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు. శాశ్వతమైన పరిష్కారం, ఫలాలను అందించే రాజీమార్గాన్ని కక్షిదారులు ఎంచుకోవాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్దాలత్కు విశేష స్పందన లభించిందన్నారు. మూడు జిల్లాల పరిధిలో 43 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని, న్యాయస్థానంలో రాజీకి అనుగుణంగా 25 వేల పైచిలుకు కేసులను గుర్తించామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, అధికారులు, బ్యాంకులు, బీమా కంపెనీలు అందించిన సేవలకు న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ లోక్ అదాలత్తో తొలిసారిగా రెండు కేసుల్లో రూ.2 కోట్లు అందించినట్లు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్, ద న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీల ద్వారా రూ.1.9 కోట్లు బాధితులకు అందజేశారు. ఏడో అదనపు జిల్లా కోర్టులో రూ.40 లక్షలు, 12వ అదనపు జిల్లా కోర్టులో రూ.1.5 కోట్లు పరిహారంగా అందజేశారు. తొలిసారిగా భారీ మొత్తంలో పరిహారాన్ని వినియోగదారులకు అందించి న్యాయస్థానాలకు సహకరించిన బీమా కంపెనీలకు కార్యదర్శి సన్యాసినాయుడు అభినందించారు.
కేసుల వివరాలు
160 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించి నష్టపరిహారం కింద రూ.12,55,19,761 అందజేశారు. సివిల్ 430 కేసులు, క్రిమినల్ 13,722 కేసులు, సీ్త్ర లిటిగేషన్ 157 కేసులు రాజీ చేయడంలో ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోర్టులో ఉన్న సివిల్ మార్టిగేజ్ సూట్ కేసులో రూ.50 లక్షలు కేసు రాజీ కుదరింది. పీఎల్సీలో రూ.70 లక్షలు విచారణకు ముందే (కరూర్ వైశ్య బ్యాంకు) రాజీ ప్రయత్నాల ద్వారా సెటిల్మెంటు పూర్తయింది. అయిదు కేసులకు సంబంధించిన భార్యభర్తలు తిరిగి కలిసి జీవించడానికి అంగీకారం కుదిరింది. అంతిమ తీర్పు
అనకాపల్లి టౌన్: లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పని, సులువుగా తగవులు పరిష్కరించుకోవాలని పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వి నరేష్ అన్నారు. స్ధానిక కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఏడు బెంచ్లు నిర్వహించారు. మొత్త్తం 2053 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తులు పి.నాగేశ్వరావు, జి.రామకృష్ణ, జి.ధర్మారావు, ఎ.రమేష్, బి.వి.విజయలక్ష్మి, నికితా సెంగర్ తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్తో సత్వర న్యాయం


