విశాఖలో భూప్రకంపనలు
ఆరిలోవ/డాబాగార్డెన్స్/మధురవాడ/మల్కాపురం/తగరపువలస/మురళీనగర్: నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వేకువజాము 4.20 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీన్ని నిద్రలో ఉన్నవారు గుర్తించలేకపోయినా.. ఇళ్లలో సామాన్లు కిందపడిన వారు అకస్మాత్తుగా నిద్రలేచి, భయాందోళన చెందారు. ఆరిలోవ కాలనీ, టీఐసీ పాయింట్, బాలాజీనగర్, రవీంద్రనగర్, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, హనుమంతవాక, మధురవాడ పరిధి శివశక్తినగర్, శారదానగర్, సాయిరాం కాలనీ, వికలాంగుల కాలనీ పరిసర కొండవాలు ప్రాంతాలు, తగరపువలస, భీమిలి, ఆనందపురం, మురళీనగర్, మాధవధార, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి మహారాణిపేట, డాబాగార్డెన్స్, ఓల్డ్సిటీ, బీచ్రోడ్డు, అల్లిపురం, జ్ఞానాపురం, మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో గుర్తించగలిగే స్థాయిలో ఈ భూ ప్రకంపనలున్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. కార్తీకమాసం పూజలు, వాకింగ్, పాలప్యాకెట్ల కోసం అప్పటికే నిద్రలేచిన ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో మంచాలు, కబ్ బోర్డుల నుంచి వస్తువులు దొర్లిపడ్డ చోట మరింత ఆందోళన చెందారు. తమ వారిని నిద్రలేపి మరీ కొందరు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 3 నుంచి 10 సెకన్ల పాటు ఆయా ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ప్రజలు చెప్తున్నారు
ఇద్దరు మహిళలకు గాయాలు
భూ ప్రకంపనల సమయంలో జీవీఎంసీ రెండోవార్డు సంతపేటలో నందిక రమణ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గేటు రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు మహిళలు గాయపడ్డారు.
రిక్టర్ స్కేల్పై 3.7గా నమోదు
విశాఖలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.7 మాగ్నిట్యూడ్గా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. విశాఖపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల వద్ద 10 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంపాలు, వల్కనోలపై అధ్యయనం చేస్తున్న వల్కనో డిస్కవరీ సంస్థ వెల్లడించింది.
నగరంలో పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
విశాఖలో భూప్రకంపనలు


