
బోధనేతర కార్యక్రమాల బహిష్కరణ
డీఈవోకు వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయులు
అనకాపల్లి టౌన్: బోధనేతర కార్యక్రమాలను శుక్రవారం నుంచి ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఈ మేరకు స్థానిక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈవో గిడ్డి అప్పారావు నాయుడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్.చిరంజీవి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడంతో బోధనపై ఆసక్తి తగ్గుతోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 10 నుంచి బోధన, విద్యార్థుల హాజరు, భోజన పథకానికి సంబంధించిన పనులను మాత్రమే ఉపాధ్యాయులు నిర్వహిస్తారని తెలిపారు. విద్యాశక్తి, జీఎస్టీ 2.0 పనులు లాంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలు చేపట్టబోరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమలో ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, కె.నరహరి, బి.మనోజ్ కుమార్, చందోలు వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.