
ఎండీయూల రద్దుతో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది
● ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ అంటూ ఆందోళన ● వృద్ధులు, దివ్యాంగుల ఇంటికే సరకుల పంపిణీతో ఆర్థిక భారం పడుతోందని ఆవేదన ● కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ● లేకుంటే మూకుమ్మడి రాజీ నామాకు సిద్ధమని ప్రకటన ● వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే బాగుందంటున్న డీలర్లు
‘ఇంటింటి’ భారం మావల్ల కాదు..
రేషన్ డీలర్ డీలా..
తుమ్మపాల: ఎండీయూలను రద్దు చేసి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం తీరు.. ఇప్పుడు రేషన్ డీలర్లలో ఆగ్రహావేశాలను రగిలిస్తోంది. కేజీకి కేవలం రూ.1 కమిషన్తో అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్న తమకు రోజుకో రకంగా నిబంధనలు పెడుతూ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ఖర్చంటూ ఎండీయూ వాహనాలను నిలిపేసి ఆ భారాన్ని తమపై రుద్దడం దారుణమని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మించి మంచి జరుగుతుందని, తమ బతుకులు మారతాయని కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే వెట్టిచాకిరి చేయించేలా కార్యాచరణ చేపడుతున్నారని వాపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కిరోసిన్ నిలిపివేత, బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చి డీలర్ల పొట్టకొట్టిన చంద్రబాబు మళ్లీ ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నారని, జగన్ ప్రభుత్వంలో ప్రశాంతంగా ఉన్న తాము కూటమి ప్రభుత్వంలో అష్టకష్టాలు పడుతున్నామని, ప్రభుత్వం గోరంత ఇచ్చి కొండంత పనులు చెబితే సహించేది లేదని అవసరమైతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. సరకుల పంపిణీ నిలిచిపోకుండా అధికారులు డీలర్లను బుజ్జగిస్తూ నెట్టుకొస్తున్నారు.
ఆర్థిక భారం
రేషన్ డిపోల ద్వారా బియ్యం పంపిణీ చేసినందుకు ప్రభుత్వం డీలర్లకు కొన్నేళ్లుగా కేజీకి కేవలం రూ.1 కమిషన్గా చెల్లిస్తోంది. దీంతో డిపోల నిర్వహణ కష్టంగా ఉందని డీలర్లు చెబుతున్నారు. కమీషన్ పెంచాలని, ఒంటరి వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే సరకుల పంపిణీ ఖర్చులకు గాను అదనంగా నెలకు రూ.5 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. డిపో నిర్వహణతోపాటు సరకుల పంపిణీకి కూలీని పెట్టడానికి, ఒంటరి వృద్ధుల ఇంటింటి సరకుల పంపిణీతో పాటు ఇతర పనులను నెలకు రూ.10 నుంచి 15 వేల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇంటింటి సరకుల పంపిణీకి ద్విచక్ర వాహనం, పెట్రోల్ ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదంటున్నారు.
అన్నీ ఇన్నీ సమస్యలు కావు
జిల్లాలో ఉన్న మొత్తం 1,069 డిపోల పరిధిలో దివ్యాంగులు, ఒంటరి వృద్ధులకు సంబంధించి 68,751 కార్డులున్నాయి. వీరి ఇళ్లకు వెళ్లి సరకులు అందించాల్సి ఉంది. అయితే అందులో 45,964 కార్డుదారులకు మాత్రమే (66.86 శాతం) ఇంటికి వెళ్లి పంపిణీ చేయగలుగుతున్నామని డీలర్లు చెబుతున్నారు. మిగిలిన వారికి పంపిణీ చేయడంలో పలు రకాల ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో పై అంతస్తుల్లో ఉన్న వారికి సరకులు మోసుకెళ్లడం కష్టంగా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని పెద్ద డిపోలు తప్ప దాదాపు 95 శాతం డిపోల పరిధిలో కార్డులు తక్కువ ఉంటాయి. కేవలం 2 నుంచి 3 టన్నుల సరకులు పంపిణీ చేయాల్సిన డిపోలు అనేకం ఉంటాయి. వారికి రెండు మూడు వేల రూపాయల కమిషన్ మాత్రమే వస్తుంది.
జగన్ ప్రభుత్వంలో డీలర్లకు గౌరవ వేతనం
గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఏనాడూ డీలర్లు ఆందోళన చెందలేదని ఇటీవల పట్టణంలో జరిగిన డీలర్ల సమావేశంలో పలువురు అధికారుల ముందే కుండబద్దలు కొట్టారు. ఎండీయూ వాహనాలను పెట్టినప్పటికీ తమకు ఎటువంటి హానీ జరగలేదని, సరకుల పంపిణీ పని లేకుండానే కేజీకి రూ.1 కమీషన్ బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేదని, కూటమి ప్రభుత్వంలో తలవంపులు తప్ప తమకేమీ మిగలడం లేదని వాపోయారు. అదనపు కమిషన్ చెల్లించకుండా ఇంటింటి సరకుల పంపిణీపై ఒత్తిడి చేస్తే రాజీనామాలకు సిద్ధమని గత నెల 21న పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో డీలర్లు స్పష్టం చేశారు.
పౌర సరఫరాల శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న డీలర్లు (ఫైల్)
ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు సరకులు పంపిణీ చేస్తున్న డీలర్లు
మా కష్టాన్ని గుర్తించడం లేదు
గత ప్రభుత్వం డీలర్లకు వేతనం చెల్లించడంతో పాటు ఎండీయూ వాహనాలకు అదనంగా చెల్లించేది. సరకులు ఇంటింటికీ అందించేది. ఇప్పుడు కూడా అదేవిధంగా సరకులు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నందుకు ఖర్చులు చెల్లించాలి. ప్రస్తుత ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించడం లేదు.
–కె.నూకయ్యశెట్టి, డీలర్, గాంధీనగరం
నెలకు రూ.5 వేలు చెల్లించాలి
1983 నుంచి డీలర్గా ఉన్నాను. ఎప్పుడూ ఇలాంటి కష్టం పడలేదు. బహుళ అంతస్తులు, అపార్ట్మెంట్లలో ఉండే వారికి సరకుల పంపిణీ భారంగా ఉంది. వాహనంపై సరకులు తీసుకెళ్లడానికి బండికి పెట్రోల్, పనిమనిషికి ఖర్చు ఎవరిస్తారు. నెలకు రూ.5 వేలు అదనంగా అందించాలి.
– బండి అప్పారావు, ఉపాధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంఘం, అనకాపల్లి రూరల్

ఎండీయూల రద్దుతో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది

ఎండీయూల రద్దుతో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది

ఎండీయూల రద్దుతో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది