
నోటు పుస్తకాలను సకాలంలో సరిదిద్దాలి
కశింకోట: విద్యార్థుల నోట్ పుస్తకాలనుసకాలంలో సరిదిద్ది లోపాలను సరి చేయాలని విద్యా శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) విజయ భాస్కర్ ఉపాధ్యాయులకు సూచించారు. కశింకోటలోని బాలికోన్నత పాఠశాలను, తేగాడ గ్రామంలోని మోడల్ స్కూల్, కేజీబీవీని జిల్లా విద్యా శాఖ అధికారి జి.అప్పారావునాయుడు, ఉప విద్యా శాఖ అధికారి పి.అప్పారావుతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా టెన్త్ చదువుతున్న విద్యార్థుల సెక్షన్కు వెళ్లి నోట్ పుస్తకాలు ఉపాధ్యాయులు సవ్యంగా దిద్దారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. గణితం, పీఎస్, ఎన్ఎస్ వంటి పాఠ్యాంశాల నోట్ పుస్తకాలు బాగా సరి దిద్దినప్పటికి మిగిలిన పాఠ్యాంశాల నోట్ పుస్తకాలను సరిదిద్దకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిలబస్ ప్రకారం పాఠాలు జరిగాయా? లేదా? అనే విషయాన్ని, విద్యార్థుల చదువు తీరును విద్యార్థులను ప్రశ్నించి పరిశీలించారు. టెన్త్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలన్నారు.
మధ్యాహ్న భోజనంపై ఫిర్యాదులు వస్తే సహించం
అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరును పరిశీలించారు. భోజనం సరిపడినంత మేర విద్యార్థులకు అందించడం లేదని తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని ఆర్జేడీ హెచ్చరించారు. సరిపడినంతగా సరకులు, బియ్యం సరఫరా కావడం లేదా? అని భోజన పథకం నిర్వాహకులను ప్రశ్నించారు. ఎండీఎం రికార్డులను, స్టాక్ రిజిస్టార్ను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి, ఆహార పదార్థాల రుచి చూశారు.
వారానికి 36 పీరియడ్స్ తప్పనిసరి
అనంతరం ఉపాధ్యాయులతో ఆర్జేడీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు వారానికి తప్పనిసరిగా 36 పీరియడ్స్ పాఠ్యాంశాలను బోధించాలన్నారు. పాఠశాలకు ఉదయం 9 గంటలలోగా హాజరు కావాలన్నారు. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం ప్రారంభంలోను, ముగిసే సమయంలోను ఆన్లైన్ హాజరు నమోదు చేసుకోవాలన్నారు. విద్యార్థుల ఆన్లైన్, ఆఫ్లైన్ హాజరు ఒకేలా ఉండేలా చూడాలన్నారు. ఎంఈవో కె.ఎస్.ఎన్.మూర్తి, విద్యా కమిటీ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్చాలి
బడిఈడు పిల్లలను శత శాతం పాఠశాలల్లో చేర్చి చదివేలా సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ విజయ భాస్కర్ మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బడిఈడు పిల్లలు ఎంత మంది ఉన్నారనే విషయమై రికార్డులను పరిశీలించి ఆరా తీశారు. కార్యాలయ పని తీరును పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సురేష్కుమార్, మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్జేడీ విజయ భాస్కర్
కశింకోట బాలికోన్నత పాఠశాల సందర్శన

నోటు పుస్తకాలను సకాలంలో సరిదిద్దాలి