
‘బాబు’ మోసాలను ఎండగడదాం!
దేవరాపల్లి : కూటమి ఏడాది పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయకుండా చంద్రబాబు సహా ఆ పార్టీల నేతలు చేసిన మోసాలను ఇంటింటికి వెళ్లి ప్రజల వద్ద ఎండగడదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తారువలోని వైఎస్సార్ ఆడిటోరియంలో గురువారం ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ’కార్యక్రమంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి తదితరులు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ పేరిట చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చే క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ 2.0లో పార్టీ కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత కల్పిస్తామని వైఎస్ జగన్ భరోసా కల్పించారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా తామంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసగించగా.. వైఎస్ జగన్ మాత్రం మేనిఫెస్టోలోని నవరత్న పథకాలతో పాటు చెప్పనవి ఎన్నో పథకాలను గత ప్రభుత్వ హయాంలో అమలు చేశారని గుర్తు చేశారు. కూటమి పార్టీలను గెలిపించి తప్పు చేశామని ప్రజలు పశ్చాతాపం పడుతున్నారని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ రూపకల్పన చేసిన అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చి తన కుమారుడు రూపకల్పన చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబులా నిస్సుగ్గుగా అబద్దాలు చెప్పే నాయకుడు ఈ భూప్రపంచంలో ఎక్కడా ఉండరని ఎద్దేవా చేశారు. ముఖ పరిచయం లేని సీఎం రమేష్ను ఎంపీగా గెలిపిస్తే, దర్జాగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.
జరిగిన నష్టంపై అవగాహన కల్పించాలి..
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నయవంచనను, వైఫల్యాలను గ్రామ స్థాయిలో కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ఏడాది పాలనలో ప్రతి ఇంటికి జరిగిన నష్టంపై కూటమి నేతలను నిలదీసేలా ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు గ్రహించారని, జగన్ పర్యటనకు ఉప్పెనలా తరలివస్తున్న జనమే ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్కు వస్తున్న జనాదరణను చూసి కూటమి నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు.
బాబు మోసగాడు... పవన్ వేషగాడు
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా చంద్రబాబు మోసగాడిలా, పవన్ వేషగాడిలా మిగిలిపోయారని విమర్శించారు. చంద్రబాబు లాంటి చీటర్ దేశంలోనే లేరని విమర్శించారు. పార్టీలకు అతీతంగా పథకాలు అందించి జగన్ మగాడిలా, మొనగాడిలా నిలిచారన్నారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సైతం జగన్ నామస్మరణం చేస్తున్నారన్నారు. కూటమి నేతల మోసాలను ఎండగట్టేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు.
ఏడాదిలోనే కూటమిపై తీవ్ర వ్యతిరేకత
పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు చంద్రబాబు, పవన్కల్యాణ్ సంతకాలతో కూడిన బాండ్ ఇచ్చి ప్రజలకు పంగనామాలు పెట్టారన్నారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్ ప్రయాణం పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్, సీడీసీ చైర్మన్ సుంకరి శ్రీను, మాడుగుల, కె.కోటపాడు ఎంపీపీలు తాళ్లపురెడ్డి రాజారామ్, దేవరాపల్లి, మాడుగుల జెడ్పీటీసీలు కర్రి సత్యం, కిముడు రమణమ్మ, పార్టీ మండల అధ్యక్షులు బూరె బాబూరావు, గొల్లివిల్లి రాజుబాబు, వేమవరపు రామధర్మజ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వరదపురెడ్డి లలితానాయుడు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, ఆర్వీకే నాయుడు తదితర్లు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ నేతల పిలుపు
తారువలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం
పాల్గొన్న అమర్నాథ్, బూడి, ధర్మశ్రీ, శోభా హైమావతి
బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కూఆర్ కోడ్ ఆవిష్కరణ

‘బాబు’ మోసాలను ఎండగడదాం!

‘బాబు’ మోసాలను ఎండగడదాం!

‘బాబు’ మోసాలను ఎండగడదాం!

‘బాబు’ మోసాలను ఎండగడదాం!