
ఎన్టీఆర్ ఆస్పత్రి కార్మికుల తొలగింపునకు కూటమి కుట్ర
● మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విల్లూరి పైడారావు
అనకాపల్లి: చాలీచాలని జీతాలతో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి తొలగించడం అన్యాయమని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఎన్టీఆర్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ మెంబర్ విల్లూరి పైడారావు తెలిపారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గవరపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ వైద్యాలయంలో ఇప్పటికే ముగ్గురు పారిశుధ్య కార్మికులను తొలగించారన్నారు. మిగిలిన 9 మందిని తొలగించడానికి కుట్ర పన్నుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా శానిటేషన్ వర్కర్లను మార్చవద్దని కోరారు. ప్రస్తుత కొత్త అడ్వైజరీ కమిటీ సభ్యుడు కాంట్రాక్టర్ని బెదిరించి తన మనుషుల్ని వేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేతో ఆస్పత్రి అధికారికి చెప్పడం అన్యాయమన్నారు. ప్రజా సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చిన్ని యాదవ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యాలయాన్ని రాజకీయాల వేదికగా మార్చొద్దన్నారు. అడ్వైజరీ కమిటీ సభ్యులు వైద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ సేవా సమితి జిల్లా కోఆర్డినేటర్ బండి అప్పారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్యాలయంపై పూర్తి దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కొల్లి చిన్నప్పారావు, బొడ్డు సోమరాజు, ఆడారి బుచ్చిరాము, పల్లా సత్య అప్పారావు, వాసుపల్లి తాతయ్యలు, కుంచావారి చిన్ను, కాండ్రేగుల రామలింగేశ్వరరావు, దాడి నూక అప్పారావు తదితరులు పాల్గొన్నారు.