
మళ్లీ కరోనా.. జర జాగ్రత్త
అనకాపల్లి టౌన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే గడగడలాడించిన వ్యాధి. దీని బారిన ఇంచుమించుగా ప్రతి ఒక్కరూ పడ్డారనే చెప్పొచ్చు. కొంత మంది ప్రాణాలను సైతం పోగట్టుకున్నారు. మరికొంత మంది చావు దగ్గరకు వెళ్లి ప్రాణాలతో బయట పడ్డారు. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. అయినా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి మందస్తు హెచ్చరికలు రాలేదు. మరోవైపు అశ్రద్ధ వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ తప్పనిసరని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఐదు కేసులు
తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తోంది. మూడు రోజుల క్రితం విశాఖపట్నంలో తొలి కరోనా కేసు నమోదు కాగా, తర్వాత ఒకటి, కడపలో రెండు కేసులు నమోదయ్యాయి. తెలంగాణాలో కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే పలు దేశాలలో వైరస్ పలు వేరియంట్లతో విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
పట్టణంలో యథేచ్ఛగా..
పట్టణంలో జనం యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదు. ఆదివారం కావడంతో ఫిష్, చికెన్, మటన్ మార్కెట్లు కిటకిటలాడాయి. సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా తిరుగుతున్నారు.
వ్యాధి లక్షణాలు..
పొడి దగ్గు, గొంతు నొప్పి, జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రుచి, వాసన గుర్తించలేకపోవడం మొదలైనవి.
జాగ్రత్తలు..
వ్యాధి లక్షణాలు గమనిస్తే వెంటనే సమీపంలోని ఉన్న పీహెచ్సీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి తెలియజేయాలి. వారి ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. చేతులపై ఉన్న హానికారక క్రిములను తొలగించుకోవడానికి శాసీ్త్రయమైన పద్ధతిలో చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీరు, ఆల్కహాల్ శానిటైజర్లను ఉపయోగించుకొని చేతులను ఎప్పటికప్పుడు రుద్దుకోవాలి. చేతులతో ముఖం, నోరు, కళ్లు, ముక్కును తాకరాదు. బహిరంగ ప్రదేశాలలో, పని ప్రదేశాలలో తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. అత్యవసరమైతేనే ఆస్పత్రులకు వెళ్లాలి. వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలి. ఎక్కడా గుంపులుగా ఉండరాదు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలి.
జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే హోం ఐసోలేషన్ తప్పనిసరి
ముందస్తుగా ఎన్టీఆర్ ఆస్పత్రిలో 10 బెడ్లు సిద్ధం
కరోనా చికిత్సపై ప్రభుత్వం నుంచి విడుదల కాని మార్గదర్శకాలు
ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం..
కరోనా కేసులు మళ్లీ వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. ఆస్పత్రిలో ఇప్పటికే 10 బెడ్స్ను సిద్ధం చేశాం. ఆక్సిజన్ సిలెండర్లు, మందులు కూడా అందుబాటులో ఉంచాం. ముఖ్యంగా ప్రజలందరూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. బయటకు వెళ్తే మాస్క్ తప్పనిసరిగా వాడాలి. ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి మార్గదర్శకాలు జారీ కాలేదు.
– ఎస్.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్,
ఎన్టీఆర్ వైద్యాలయం, అనకాపల్లి

మళ్లీ కరోనా.. జర జాగ్రత్త

మళ్లీ కరోనా.. జర జాగ్రత్త