
ఒక్కో పోస్టుకు 43 మంది పోటీ
విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు శిక్షణార్థులు భారీగా పోటీపడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 29,779 మంది అభ్యర్థులు 49,658 దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉండనుంది. అంటే ఒక్కో పోస్టుకు 43 మంది పోటీపడుతున్నారు. ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు అర్హతలను బట్టి ఆయా సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ
డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు.
భర్తీ కానున్న పోస్టులు ఇవే..
ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734(ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49,658 పైగా దరఖాస్తులు కొలువు కొట్టాలంటే కష్టపడాల్సిందే..