అంబులెన్స్ కల్పనలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం
నర్సీపట్నం: గిరిజనులకు అంబులెన్స్ ఏర్పాటు చేయటంలో ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని ఏపీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గోవిందరావు డిమాండ్ చేశారు. రావికమతం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన సీరగం జమ్మన్న(67)కు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రిలో చేర్పించారన్నారు. అక్కడ వైద్యులు విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారన్నారు. వెంటనే ఐటీడీఏ అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేయగా, డీజిల్ ఖర్చులు పెట్టుకోవాలని సూచించారన్నారు. మరలా ఫోన్ చేస్తే పాడేరు మీటింగ్లో ఉన్నాం.. ప్రైవేట్ అంబులెన్స్ పెట్టుకోవాలని చెప్పారన్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో ప్రైవేట్ అంబులెన్స్లో కేజీహెచ్కు తీసుకెళ్లారన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఏరియా ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని, వైద్యులు మాత్రం రిఫర్ చేయటం దారుణమన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నా దృష్టికి రాలేదు..
పాడేరు పీవో ఇచ్చిన జాబితాలో ఉన్న వారికి ట్రైబుల్ అంబులెన్స్ సమకూరుస్తారు. అంబులెన్స్ కావాలని ఎవరూ అడగలేదు. బాధితులు నా దృష్టికి తీసుకువచ్చి ఉంటే ఆస్పత్రి అంబులెన్స్ సమకూర్చేవాళ్లం.
– డాక్టర్ నీలవేణిదేవి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, నర్సీపట్నం
ఏపీ గిరిజన సంఘం ఆరోపణ