బెల్ట్‌ షాప్‌పై దాడి | - | Sakshi
Sakshi News home page

బెల్ట్‌ షాప్‌పై దాడి

Jun 1 2025 12:57 AM | Updated on Jun 1 2025 1:14 AM

బెల్ట్‌ షాప్‌పై దాడి

బెల్ట్‌ షాప్‌పై దాడి

అచ్యుతాపురం రూరల్‌: మండలంలోని మెలుపాక జగన్నాథపురంలో జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఇక్కడ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకుని, అతడి నుంచి 53 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రామాన్ని కలెక్టర్‌ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఉదయం 9 గంటల ప్రాంతంలో మఫ్టీలో ఉన్న అధికారులను గుర్తించని విక్రయదారు వారి ఎదుటే మద్యం అమ్మకాలు చేయడంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘కలెక్టర్‌ దత్తత గ్రామంలో బెల్ట్‌షాపు’ అనే శీర్షికతో ఇటీవల సాక్షిలో వచ్చిన కథనానికి అధికారుల్లో చలనం లేకపోవడంతో గ్రామస్తులు ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించారు. ఎంజేపురం బెల్ట్‌ షాపులో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. ఇక్కడ ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. దాంతో గ్రామ రైతులు మద్యానికి బానిసై ఏ విధమైన పనులు చేయలేకపోతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ శ్రమించిన సొమ్మంతా మద్యం సేవించడానికే సరిపోతుందని, ఇంటికి చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన విలేకరి అక్కడకి చేరుకుని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగా, మఫ్టీలో ఉన్న అధికారులు అతని మొబైల్‌ బలవంతంగా లాక్కొని చేతిపై గాయపరిచారు. అంతేకాకుండా మొబైల్‌లో అప్పటి వరకూ తీసిన ఫొటోలు డిలీట్‌ చేశారు. సదరు అధికారులు విలేకరిపై దురుసుగా ప్రవర్తించడంతో పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా రాంబిల్లి, యలమంచిలి పరిధిలో టాస్క్‌ఫోర్స్‌, ఎకై ్సజ్‌ డిపార్ట్‌మెంట్‌ వారు దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యలమంచిలి ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ తేజ తెలిపారు.

53 మద్యం సీసాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement