
చెట్టు పైనుంచి పడిన యువకుడు మృతి
బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామానికి చెందిన నడిపల్లి తరుణ్(19) ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. గత నెల 15వ తేదీన గ్రామంలో తాడిచెట్టు ఎక్కి తాటికాయలు నరికి చెట్టు దిగుతుండగా తరుణ్ కాలు జారి పడిపోయాడు. అపస్మారక స్థితికి చేరిన ఆయన్ను అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గత 20 రోజులుగా వైద్య సేవలు పొందుతూ తరుణ్ శుక్రవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన తల్లి పద్మ.. తరుణ్ చిన్నతనంలోనే మృతి చెందగా.. తండ్రి అప్పలనాయుడు బాగోగులు చూసుకుంటున్నాడు. ఐటీఐ చదువుతున్న తరుణ్ అకాల మృతితో తండ్రి అప్పలనాయుడు భోరున విలపిస్తున్నాడు.