
ఏపీ పీజీ ఈసెట్ ప్రారంభం
మద్దిలపాలెం(విశాఖ): రాష్ట్రవ్యాప్తంగా ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీ ఈసెట్ 2025 శుక్రవారం ప్రారంభమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ఈ పరీక్షలను ప్రారంభించారు. పరీక్షల తొలిరోజు ఉదయం సెషన్లో 92 శాతం, మధ్యాహ్నం సెషన్లో 82 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏయూ నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష సెట్ కోడ్ను వీసీ విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య ఎన్.కిశోర్ బాబు, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, సెట్ కన్వీనర్ ఆచార్య పి.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు శని, ఆదివారాల్లో కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.