ముస్లిం కుటుంబంపై కక్షసాధింపు | - | Sakshi
Sakshi News home page

ముస్లిం కుటుంబంపై కక్షసాధింపు

Jun 7 2025 1:34 AM | Updated on Jun 7 2025 1:34 AM

ముస్లిం కుటుంబంపై కక్షసాధింపు

ముస్లిం కుటుంబంపై కక్షసాధింపు

నాతవరం: ముస్లిం కుటుంబంపై కూటమి నేతలు కక్షసాధింపు చర్యలకు దిగారు. కుమారుడి పెళ్లి వేడుకలో ఉండగా పొక్లెయిన్‌తో వారి ఇల్లు కూల్చివేశారు. దీనికి సంబంధించి బాధితుడు తెలిపిన వివరాలు.. జిల్లేడుపూడి పంచాయతీ శివారు వై.వెంకయ్యపాలెం గ్రామానికి ఇరవై ఏళ్ల క్రితం షేక్‌ సుభాన్‌ కుటుంబం వలస వచ్చింది. దివంగత పారిశ్రామికవేత్త, నూకాంబిక అలయ నిర్మాణకర్త ఎం.ప్రభాకర్‌ చౌదరి సుభాన్‌కు ఆశ్రయం కల్పించారు. సుభాన్‌ ఓ రైతు నుంచి స్థలం కొని తాటాకు ఇల్లు కట్టుకొని చికెన్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రభాకర్‌ చౌదరి దివంగతులయ్యాక సుభాన్‌కు సమస్య మొదలైంది. సుభాన్‌ ఇంటికి సమీపంలో ఉన్న జీడిపిక్కల పరిశ్రమను కేరళకు చెందిన వ్యక్తి నడిపేవారు. ఆయన వేరొకరికి పరిశ్రమను విక్రయించారు. జీడి పిక్కల ఫ్యాక్టరీకి ఈశాన్య భాగంలో సుభాన్‌ ఇల్లు ఉందని, దాంతో వ్యాపారం సరిగా జరగలేదంటూ ఇల్లు ఖాళీ చేయమని కొత్త యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఈ వివాదం రెండేళ్ల నుంచీ నలుగుతోంది. జీడి పిక్కల ఫ్యాక్టరీ యజమాని టీడీపీకి చెందిన స్థానిక సర్పంచ్‌కు సన్నిహితుడు కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సుభాన్‌కు సమస్య మొదలైంది. ఏప్రిల్‌ నెలలో పంచాయతీ డ్రైనేజీ పనుల నెపంతో పొక్లెయిన్‌తో వీరి ఇంటి ముందు భాగంలో కాలువ పనులు చేశారు. టీడీపీ నేతలు, అధికారుల అండతో తన ఇంటికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన సుభాన్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే రెండు రోజుల క్రితం ఆయన ఇంటిని నేలమట్టం చేశారు.

కుమారుడి వివాహం రోజునే ఇల్లు కూల్చివేత

తన చిన్న కుమారుడి వివాహం నిమిత్తం ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సమీపంలో జగ్గంపేట వెళ్లామని సుభాన్‌ చెప్పారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పొక్లెయిన్‌తో తమ ఇంటిని కూల్చేశారని, శబ్దం రావడంతో ఇంటి పక్కనే నివాసం ఉంటున్న చిటికిల కృష్ణవేణి గమనించి ‘ఏమిటీ అన్యాయం’ అని ప్రశ్నించగా.. ముఖానికి ముసుగులు వేసుకున్న వ్యక్తులు నీకు సంబంధమేమిటని బెదిరించి వెళ్లిపోయారని వివరించారు. సమాచారం అందుకొని వెంటనే 100 నంబరుకు ఫిర్యాదు చేశామన్నారు. నాతవరం పోలీసులు వెంటనే తమ నుంచి వివరాలు తీసుకున్నారని, కానీ నేటి వరకు రాలేదన్నారు. దుండగులు తాము బక్రీద్‌ పండగ కోసమని పెంచుతున్న మేకపోతును కూడా తీసుకుపోయారన్నారు. ఈనెల 5న ఇంటికి చేరుకొని, ఫ్రిజ్‌ తదితర విలువైన సామగ్రితో సహా తమ ఇల్లు ధ్వంసమైన దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్నామన్నారు. 6వ తేదీన బంధుమిత్రులకు పెళ్లి భోజనాలకు పిలిచామని, కానీ తామే రోడ్డున పడ్డామని వారు ఆవేదనగా చెప్పారు.

వివాహ వేడుకలో ఉండగా ఇల్లు కూల్చివేత

టీడీపీ నేత అండతోజీడిపిక్కల వ్యాపారి దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement