
ఏడాది పాలనంతా మోసాలే
నక్కపల్లి/ఎస్.రాయవరం: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనంతా మోసాలు, కక్షసాధింపులకే సరిపోయిందని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు శోభాహైమావతి, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. శనివారం అడ్డురోడ్డులో పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది పాలనలో ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. సూపర్సిక్స్ హామీలన్నీ సూపర్ మోసాలని తేలిపోయిందన్నారు. రూ.4 వేలకు పింఛను పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు గత ప్రభుత్వ హయాంలోనే రూ.3 వేలు చెల్లించిన విషయం మర్చిపోయారన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు లిక్కర్ స్కాములు, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి వారం రూ.3 వేల కోట్లు రుణాలు తెస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. ఏడాదిలోనే రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చేశారన్నారు. కూటమి ఏడాది పాలనను ఎండగడుతూ మండల కేంద్రాల్లో ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినాన్ని ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని కోరారు. ఐదేళ్ల పాలనలో కార్యకర్తలను విస్మరించిన విషయాన్ని జగనన్న గుర్తించారన్నారు. రాబోయే రోజుల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తారన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని మట్టికరిపించి వైఎస్సార్సీపీ తిరిగి విజయకేతనం ఎగుర వేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను ఏ స్థాయిలో గౌరవించాలో జగనన్న దిశానిర్దేశం చేశారన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం వల్ల నష్టపోయిన ప్రతి కార్యకర్త బాధను అర్థం చేసుకుంటున్నామని, సమయం వచ్చినప్పుడు తగిన రీతిలో గుణపాఠం చెప్తామన్నారు. ఈ రోజు మీది కావచ్చు, మాకంటూ ఒక రోజు వస్తుందని కూటమి నేతలను హెచ్చరించారు. ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేక మహానాడులో జగనన్నను విమర్శించడమే పనిగా పెట్టుకుని తీర్మానాలు చేశారని ఎద్దేవా చేశారు. కడప గడ్డపై మహానాడు అట్టర్ఫ్లాప్ అయిందన్నారు. సమన్వయకర్త కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డీవి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏడాదిలోపే వచ్చేసిందని, దీన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే చాలన్నారు. కార్యక్రమంలో ఎస్.రాయవరం జెడ్పీటీసీ కాకర దేవి, ఎంపీపీ పార్వతి తాతారావు, పాయకరావుపేట, నక్కపల్లి మండలాల అధ్యక్షులు చిక్కాల రామారావు, శీరం నర్సింహమూర్తి, బీసీ విభాగం జిల్లా నాయకులు పైలా రమేష్, కొణతాల శ్రీను, వైస్ ఎంపీపీ చోడిపల్లి అప్పన్న, ధనిశెట్టి బాబూరావు, జిల్లా మహిళా నాయకురాలు లోచల సుజాత, మధువర్మ, రాజేష్ ఖన్నా, జగతా శ్రీను, డి. సాయిబాబా, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలనుప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీలో కార్యకర్తలకు సముచిత స్థానం
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ

ఏడాది పాలనంతా మోసాలే