
ఏపీఐఐసీ నిర్వాసితులకు రూ.693 కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యా
నక్కపల్లి: మండలంలో పరిశ్రమల స్థాపన కోసం ఏపీఐఐసీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.693 కోట్లు చెల్లించనున్నట్టు హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. శనివారం వారు తహసీల్దార్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన నిర్వాసితులతో మాట్లాడారు. మండలంలో తీరప్రాంతం వెంబడి పలు పరిశ్రమలు రానున్నాయన్నారు. వీటివల్ల లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కంపెనీల కోసం భూములు ఇచ్చిన రైతులు,నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు, నివాసప్రాంతాలు ఖాళీ చేస్తున్నవారికి ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.693 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు 151 ఎకరాల్లో రూ.209 కోట్లతో లేఅవుట్లు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, ఐదు సెంట్ల చొప్పున ఇంటి స్థలం పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.8.36 లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. నిర్వాసితుల్లో 289 మంది విద్యావంతులు ఉన్నట్టు గుర్తించామని, వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఒక్కొక్కరికీ రూ.30 వేలతో నైపుణ్యశిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు, నిర్వాసితులు పరిహారం చెల్లింపుల్లో జరిగిన అన్యాయాన్ని ఈ సమావేశంలో వివరించి, న్యాయం చేయాలని కోరారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి, న్యాయం చేస్తామని మంత్రి, కలెక్టర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ నర్సింహమూర్తి పాల్గొన్నారు.