జాతర సందర్భంగా మూడు రోజుల పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాడేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర రద్దీ దృష్ట్యా ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి పట్టణంలోకి భారీ వాహనాల అనుమతిని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 700 మంది సిబ్బందితో పాటు రెండు శక్తి బృందాలు, మూడు డ్రోన్ కెమెరాలు, క్రైమ్ పార్టీ సిబ్బందిని రంగంలోకి దించామన్నారు. విశాఖపట్నం వైపు నుంచి పాడేరు వచ్చి పోయే వాహనాలు వంతాడపల్లి చెక్పోస్టు నుంచి తుంపాడ, సన్యాసమ్మపాలెం మీదుగా చింతలవీధి మార్గం మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. అరకు, ముంచంగిపుట్టు మార్గాల నుంచి వచ్చే వాహనాలు కూడా చింతలవీధి వరకే అనుమతి ఉందన్నారు. జి. మాడుగుల ప్రాంతం నుంచి విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వచ్చేపోయే వాహనాలు గొందూరు సెయింటాన్స్ పాఠశాల జంక్షన్ నుంచి లగిసిపల్లి, నక్కలపుట్టు మీదుగా వెళ్లాలని ఎస్పీ సూచించారు.


