సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు సోమవారం స్వామికి శేషతల్పవాహనంపై విశేషంగా తిరువీధి నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను శేషతల్పంపై వేంచేపు చేసి, సింహగిరి మాడవీధిలో ఊరేగించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన కోలాటం, పలు సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరువీధి అనంతరం రాత్రి వేళ ఆరాధన, విశేష హోమాలు, గ్రామబలిహరణం, మంగళాశాసనం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ క్రతువులు జరిగాయి. కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు వైదిక సదస్యం, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పండిత సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వారు సర్వజన మనోరంజని వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా మంగళవారం స్వామి మూలవిరాట్ స్వర్ణ నారసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని దేవస్థానం అధికారులు తెలిపారు.
నేడు పండిత సదస్సు


