యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద కాలనీకి చెందిన మామిడి వెంకటేష్(34) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. మృతుడికి బాగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం బంధువులతో కలిసి తలుపులమ్మలోవ దర్శనానికి వెళ్లడానికి అందరూ తయారు కాగా అంతకుముందే ఉదయం వెంకటేష్ మద్యం సేవించడంతో మళ్లీ భార్యభర్తలకు చిన్న గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ తలుపులమ్మలోవకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయాడు. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పడకగదిలో చీరతో వెంకటేష్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.


