వణుకుతున్న అరకు
● రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● 3.3 డిగ్రీల నమోదుతో పెరిగిన చలి
● దట్టంగా మంచు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజులుగా అరకువ్యాలీ ప్రాంతంలో మరింత దిగజారుతున్నాయి. దీంతో చలి, మంచు తీవ్రతకు స్థానికులు తాళలేకపోతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. శనివారం అరకువ్యాలీలో 3.3 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
పాడేరు డివిజన్ ముంచంగిపుట్టులో 4.4 డిగ్రీలు, జి.మాడుగులలో 4.8, చింతపల్లిలో 5.5, పాడేరులో 6.2, హుకుంపేటలో 6.7, పెదబయలులో 7.6, కొయ్యూరులో 11 డిగ్రీలు నమోదు అయ్యాయి. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 9.1, మారేడుమిల్లిలో 9.4, రాజవొమ్మంగిలో 11.7, అడ్డతీగలలో 12.9, రంపచోడవరంలో 14.4, గంగవరంలో 15.9 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. చింతూరు డివిజన్ చింతూరులో 12.4, ఎటపాకలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఏడీఆర్ తెలిపారు.
ముంచంగిపుట్టు: మండలంలో మంచు, చలితీవ్రత కొనసాగుతోంది. ఉదయం 8 గంటల తరువాత మాత్రమే బయటకు వస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఇళ్లకు పరిమితం అవుతున్నారు. మంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
రాజవొమ్మంగి: మండలంలో ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. శనివారం ఈ ప్రాంతంలో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. చలితీవ్రతకు ప్రజలు వణికిపోతున్నారు. కర్రలు పేర్చి నెగళ్లు ఏర్పాటుచేసుకుని ఉపశమనం పొందుతున్నారు. రహదారులను మంచు తెరలు కమ్మేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతన్నారు. మరోపక్క ఈ ప్రాంతానికి వస్తున్న సందర్శకులు మంచు అందాలను మనసారా ఆస్వాదిస్తున్నారు.
వణుకుతున్న అరకు
వణుకుతున్న అరకు


