
సింహగిరిపై విశేషంగాశ్రీనృసింహ హోమం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సింహగిరిపై శ్రీ నృసింహ హోమం విశేషంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి ఆలయ కల్యాణమండపంలో అర్చకులు హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై చక్రపెరుమాళ్లని వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, షోడషోపచారపూజలు జరిపారు. పూజలో పాల్గొన్న భక్తులకు కంకణధారణ చేసి హోమగుండం వద్ద వేంజేపచేశారు. మండపారాధన, అగ్నిప్రతిష్ట, హోమం, పూర్ణాహుతి, కుంభప్రోక్షణ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. అర్చకుడు చక్రపాణి ప్రధాన కలశాన్ని శిరసుపై పెట్టుకుని ప్రదక్షిణ చేశారు. ఆ జలాలను స్వామికి సమర్పించారు. ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు, వేదపండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.