
చిత్తశుద్ధి నిల్
ప్రచారం ఫుల్..
జి.మాడుగుల: రచ్చపల్లి గ్రామంలో గల పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేశారు. ఈ పాఠశాలలో 20మంది విద్యార్థులు చదువుతున్నారు. గురువారం ఉదయం పేరెంట్, టీచర్స్ ఆత్మీయ సమావేశం ప్రారంభమైన వెంటనే ఒక్కసారిగా విద్యార్థులు, తల్లిదండ్రులు లేచి పాఠశాల భవనం శిథిలమైందని, కొత్త భవనం కావాలని నినాదాలు చేశారు. పాఠశాలను పురాతన భవనంలో నడుపుతున్నారని, ఇది నేలకూలటానికి సిద్ధంగా ఉందని, పాఠశాలకు తమ పిల్లలను చదువుకు పంపించటానికి భయపడుతున్నామని తెలిపారు.
వర్షంలోనే పేరెంట్స్ మీటింగ్
జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వర్షంలోనే సమావేశం నిర్వహించటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గొడుగులు వేసుకొని నిల్చొని ప్రసంగాలు ఆలకించారు. వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. ఇంత అవస్థ పెట్టి సమావేశాలు నిర్వహించి, ఏం సాధించారని పలువురు కోపంతో వ్యాఖ్యానించడం కనిపించింది. చిన్నారుల ఆరోగ్యాలతో చెలగాటమాడుతారా అని నిరసన వ్యక్తం చేశారు.
సీఆర్టీని నిలదీసిన భూసుకొండ గ్రామస్తులు
సీలేరు: ఉపాధ్యాయులు లేని మెగా పేరెంట్ మీటింగులు ఎందుకని దుప్పులవాడ పంచాయతీ భూసుకొండ గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను నిలదీశారు. గురువారం జరిగిన పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో గందరగోళం చోటు చేసుకుంది. పాఠశాల పునఃప్రారంభించి నెల రోజులవుతున్నా ఇప్పటికీ బడి తెరవలేదని, ఉపాధ్యాయుడిని నియమించకుండా పేరెంట్స్ మీటింగ్ ఎందుకని మండల సీఆర్టీని నిలదీశారు. ఇలా అయితే తమ పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి.. ఉపాధ్యాయుడిని నియమించాకే ఈ సమావేశం నిర్వహించాలని, లేనిపక్షంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక సమావేశాన్ని నిర్వహించకుండా అధికారులు వెనుతిరిగారు.
సమస్యలు పరిష్కరించని సమావేశాలు ఎందుకు..?
పాడేరు : విద్యాలయాల్లో గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించడం వలన ఉపయోగం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాలను ప్రశ్నించారు. పాడేరు పట్టణంలోని కుమ్మరిపుట్టులో పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో గురువారం మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను వేదిక పైకి ఆహ్వానించకుండా అగౌరవపరచారని నిరసన వ్యక్తమైంది. నేటికీ సొంత భవనాలు నిర్మించకుండా పాడేరు గిరిజన గురుకుల పాఠశాలలో పాడేరు, హుకుంపేట ఏకలవ్య పాఠశాలల నిర్వహణతో విద్యార్థినులకు వసతి, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉందన్నారు. సరిపడ మరుగుదొడ్లు, గదులు లేవన్నారు. మెనూ ప్రకారం ఆహారం వడ్డించడం లేదన్నారు. గతంలో విద్య బోధన బాగుండేదని ఏడాది కాలంగా బోధన తీరు సక్రమంగా లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. విద్యార్థులను బయట కూర్చోబెట్టి పాడేరు, హుకుంపేట ఏకలవ్య పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే ఒక గదిలో కూర్చోబెట్టి పేరెంట్స్ మీట్ మమా అనిపించారు.
వర్షంలో తడుస్తూ..
పాడేరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్లో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదు. దీంతో మధ్యాహ్నం కురుస్తున్న చిన్నపాటి వర్షంలో తడుస్తూ పశువులు సంచరిస్తున్న చోట విద్యార్థినులు ఆరుబయట భోజనాలు చేశారు.
సీలేరు: జి.కె.వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో సీఆర్టీని నిలదీస్తున్న గ్రామస్తులు
జిల్లాలో పలుచోట్ల మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ రసాభాసగా సాగింది. జి.కె.వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ భూసుకొండలో ఉపాధ్యాయులు లేని మెగా పేరెంట్ మీటింగులు ఎందుకని గ్రామస్తులు విద్యాశాఖ అధికారులను నిలదీశారు. గ్రామంలో ఇప్పటికీ బడి తెరవలేదని, ఉపాధ్యాయుడిని నియమించలేదని నిలదీశారు. జి.మాడుగుల మండలం రచ్చపల్లి గ్రామంలో గల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నినాదాలు చేశారు. పాడేరులో జరిగిన పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సమావేశాల్లో కూడా సమస్యలపై నిరసన వ్యక్తమైంది. జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వర్షంలోనే మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం నిర్వహించటంతో ఇబ్బందులు పడ్డారు. పాడేరు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులు చిన్నపాటి వర్షంలో తడుస్తూ పశువులు సంచారిస్తున్న చోట ఆరుబయట భోజనాలు చేశారు.
మెగా పేరెంట్స్ మీటింగ్లలోసమస్యలపై తల్లిదండ్రుల నిరసనలు
టీచర్ లేని, పాఠశాల తెరవని చోట సమావేశమెందుకని నిలదీత
పలుచోట్ల వర్షంలోనే తల్లిదండ్రుల సమావేశాలు.. విద్యార్థుల అవస్థలు
విద్యాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, పాడేరు: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సమగ్రశిక్ష గురువారం ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ మీట్ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2900 పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాల గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ తల్లిదండ్రులంతా తమ పిల్లలను బడులకు పంపాలని, పిల్లల చదువులు.వారి అభిరుచులపై దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యార్థినులకు గ్రీన్ పాస్పోర్టులో భాగంగా కలెక్టర్, ఎస్పీలు మొక్కలు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎస్పీ, సబ్ కలెక్టర్ సౌర్యమన్పటేల్ మధ్యాహ్న భోజనం చేశారు. డీఈవో పి.బ్రహ్మాజీరావు, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి డీడీ రజని, ట్రైకార్ డైరెక్టర్ కూడా కృష్ణారావు, పాఠశాల హెచ్ఎం ఎస్.సింహచలం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్కుమార్

చిత్తశుద్ధి నిల్