
తగ్గని వర్షాలు.. పెరుగుతున్న నీటిమట్టాలు
ముంచంగిపుట్టు: విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని జలాశయాల నీటిమట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే ప్రధాన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు నిండుగా కళకళలాడుతున్నాయి.
● జోలాపుట్టు జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు. ఆదివారం నాటికి 2732.30 అడుగుల నీటి నిల్వ నమోదు అయింది.
● డుడుమ జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు. ప్రస్తుతం 2585.10 అడుగులకు చేరింది.
● డుడుమ,జోలాపుట్టు జలాశయాల నుంచి నీటి విడుదల వల్ల దిగువనున్న బలిమెల, డొంకరాయి, గుంటవాడ జలాశయాల్లో నీటిమట్టాలు కూడా పెరుగుతున్నాయి.
● బలిమెల జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1457.10 అడుగులకు చేరింది.
● డొంకరాయి జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు. ప్రస్తుతం 997.10 అడుగులుగా నమోదు అయింది.
● గుంటవాడ జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 1,360 అడుగులు కాగా 1352.10 అడుగులకు చేరింది.
అధికారులు అప్రమత్తం
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్టు, డుడుమ జలాశయాలు గణనీయంగా పెరుగుతుండటంతో సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. గత ఏడాది జోలాపుట్టు జలాశయ నీటిమట్టం రికార్డు స్థాయికి చేరింది. దీంతో జలాశయం గేట్లపై నుంచి ప్రవహించింది. సుమారు 40 వేల నుంచి 55 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో వరద ఉధృతికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. గ్రామాలను ముంచెత్తడమే కాకుండా మాచ్ఖండ్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. గత ఏడాది జరిగిన నష్టాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. బలిమెల, డొంకరాయి, గుంటవాడ జలాశయాల నీటిమట్టాలను జెన్కో అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
పొంగిన వాగులు, గెడ్డలు
ముంచంగిపుట్టు: మండలంలో ఏకధాటిగా వర్షాలు పడుతూనే ఉండటంతో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.లక్ష్మీపురం పంచాయతీ బిరిగూడ, ఉబ్బెంగుల, తుమిడిపుట్టు, కర్లపోదర్ వాగుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. అత్యవసర పనుల నిమిత్తం ఆయా గ్రామాల గిరిజనులు అతికష్టం మీద వాగులు దాటుకొని పంచాయతీ కేంద్రానికి వస్తున్నారు. బంగారుమెట్టలో బొనంగి నీలమ్మ అనే గిరిజన మహిళ ఇంటి గోడ వర్షానికి తడిచిపోయి ఆదివారం కూలిపోయింది. ఇల్లు మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది.
వరదనీటితో సీలేరు కాంప్లెక్సులో
జలాశయాలు కళకళ
డుడుమ ప్రాజెక్ట్ నుంచి 1600 క్యూసెక్కుల వరదనీరు విడుదల
ప్రమాదస్థాయికి చేరుకోకుండా జాగ్రత్తలు
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వరదనీరు డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లోకి భారీ గా వరద నీరు చేరుతోంది. కొద్దిరోజులుగా డుడుమ నుంచి బలిమెలకు 1600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నాం. జలాశయాల్లో నీటి మట్టాలు ప్రమాదస్థాయికి చేరు కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ,
మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం

తగ్గని వర్షాలు.. పెరుగుతున్న నీటిమట్టాలు

తగ్గని వర్షాలు.. పెరుగుతున్న నీటిమట్టాలు

తగ్గని వర్షాలు.. పెరుగుతున్న నీటిమట్టాలు

తగ్గని వర్షాలు.. పెరుగుతున్న నీటిమట్టాలు