
వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లను పరిశీలిస్తున్న ఏఎస్పీ ధీరజ్, సిబ్బంది
అరకులోయ రూరల్: స్థానిక పోలీసుస్టేషన్ సర్కిల్లోని అరకులోయ, అనంతగిరి పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు కేసుల్లో పట్టుబడిన 1,096 మద్యం బాటిళ్లు, 47 లీటర్ల సారాను శుక్రవారం పాడేరు ఏఎస్పీ ధీరజ్ సమక్షంలో ధ్వంసం చేశారు. స్థానిక రోడ్లు భవనాలశాఖ కార్యాలయం సమీపంలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సారాను పారబోశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో సారా తయారు చేసినా, విక్రయించినా అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సీఐ రుద్రశేఖర్, ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు.
దేవీపట్నం: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన నాటుసారాను రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహల్లి ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వంసం చేశారు. మండలంలో 19 కేసుల్లో పట్టుబడిన 275 లీటర్ల నాటు సారా, మరో కేసులో పట్టుబడిన బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్టు ఎస్ఐ నాగార్జున తెలిపారు.
బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ
అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్
డుంబ్రిగుడ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్ అన్నారు. మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అంజోడ సిల్క్ఫారంలో శుక్రవారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగంతో జరిగే నష్టాలు, పరిసరాల పరిశుభ్రతపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో లభించే చింతపండు, కాఫీ, కొండచీపుళ్లు, మిరియాలు, కూరగాయలు ఇతర వాణిజ్య పంటలు సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు రామరావు, పోతురాజు పడాల్, కృష్ణం నాయుడు, ఉద్దేంగ్, రేణుక, రామచంద్రరావు, మౌనిక, చంటి పాల్గొన్నారు.