ఒంగోలు టౌన్: జిల్లాలో సంచలనం సృష్టించిన సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూలు విద్యార్థి సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతిపై నెల్లూరు అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య విచారణ నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలతో నెల్లూరు ఏఎస్పీ సౌజన్యకు విచారణ బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం కనిగిరి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆమె తౌషిక్ తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీలతో సుదీర్ఘంగా మాట్లాడారు. తల్లిదండ్రుల అనుమానాలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. స్కూలు యజమాని కుమారుడు ఒక ఉపాధ్యాయునితో సన్నిహితంగా ఉండటం చూసినందుకు వల్లే తౌషిక్ను హత్య చేసినట్లు తలిదండ్రులు ఏఎస్పీ దృష్టికి తీసుకొని వచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన తౌషిక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని కోరారు.


