బోథ్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసి నెలలు గడుస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ మాత్రం ముందుకు పడడం లేదు. సాధారణంగా నూతన పాలకవర్గం ఏర్పడిన రెండు నెలల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రతీ జీపీకి ముగ్గురు..
పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం ప్రతీ గ్రామపంచాయతీకి కోఆప్షన్ సభ్యులుగా ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరిలో ఒకరు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, మూడో వ్యక్తిగా పంచాయతీకి స్థలం ఇచ్చిన దాత లేదా ప్రవాస భారతీయులను (ఎన్ఆర్ఐ) నియమించాలి. వీరికి వార్డు సభ్యులతో సమానమైన హోదా ఉంటుంది. అయితే సభల్లో పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ ఓటు హక్కు మాత్రం ఉండదు.
జిల్లాలో 473 పంచాయతీలు..
జిల్లాలో గతేడాది డిసెంబర్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 473 గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు అందుబాటులోకి కూడా వచ్చాయి. నాలుగు నెలలవుతున్నా కోఆప్షన్ సభ్యుల నియామకం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో ఉన్న జీపీల ప్రకారం మొత్తం 1,419 మందిని కో ఆప్ష న్ సభ్యులుగా నియమించాల్సి ఉంటుంది. గ్రామ అభివృద్ధిలో వీరి సలహాలు పంచాయతీ సభ్యులు తీసుకుంటారు. ప్రస్తుతానికి ఈ నియామకాలపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి మార్గదర్శకాలు అందలేదని తెలుస్తోంది.
ఆదేశాలు రాగానే నియమిస్తాం
ప్రతీ పంచాయతీలో ముగ్గురు కోఆప్షన్ సభ్యులను నియమించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చాక ప్రక్రియ పూర్తి చేస్తాం.
– రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి


