ఫ విరిగిపడిన చెట్లు, స్తంభాలు
ఫ పలు గ్రామాలకు నిలిచిపోయిన
విద్యుత్ సరఫరా
ఎటపాక: మన్యంలో గాలీ వాన బీభత్సంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. ఈదురు గాలులకు మండలంలోని నందిగామ, మురుమూరు, గౌరిదేవిపేట గ్రామాల పరిధిలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 11 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సోమవారం రాత్రి నుంచి తోటపల్లి ఫీడర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ సిబ్బంది శ్రమించి తోటపల్లి నుంచి గౌరిదేవిపేట, బండిరేవు గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రాత్రి కూడా నందిగామ, మురుమూరు, చలంపాలం, ఎర్రగట్టు, బండారుగూడెం గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సాధ్యం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. సెల్ఫోన్లకు చార్జింగ్ లేక మూగబోయాయి. అయితే పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులు చదువుకునేందుకు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షం కారణంగా కళ్లాల్లో ఆరబోసిన మిర్చి, పాకల్లో ఎండబెట్టిన పొగాకు తడిసిపోయింది. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదనే ఆందోళనలో రైతులు ఉన్నారు.


