గుర్తేడులో గంజాయి స్వాధీనం
వై.రామవరం: ఉమ్మడి వై.రామవరం మండలం గుర్తేడు పోలీసు స్టేషన్ పరిధిలోని కడారికోట రోడ్డు జంక్షన్లో సుమారు రూ.3.60 లక్షల విలువైన 24 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎస్సై రాజకోటి తెలిపారు. సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతుందన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా, ఈ గంజాయి పట్టుబడినట్లు ఆయన తెలిపారు. గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నారు. గంజాయిని మైదాన ప్రాంతానికి తరలిస్తున్న చిలకలూరిపేటకు చెందిన కొడాబత్తుల బాలస్వామి నాయక్ (27), అదే ప్రాంతంలోని బలుసుపాడుకు చెందిన రెడ్డిబత్తుల వేణుగోపాల్రెడ్డి (35), నూజివీడుకు చెందిన షేక్ నూరుల్ రహీమ్ (37)లను అరెస్ట్ చేశామన్నారు. వారిని సోమవారం సాయంత్రం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. ఈ కేసులో నాలుగో వ్యక్తి మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలించినట్లు వివరించారు.
రంపచోడవరం: క్షయ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని జిల్లా జేసీ బచ్చు స్మరణ్రాజ్ అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్షయ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి టీబీ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రతి గ్రామంలోని టీబీ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు వారాల పాటు దగ్గు తగ్గకుండా ఉంటే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి వెళ్లి టీబీ పరీక్షలు చేయించుకుని, నిర్ధారణ అయితే క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. క్షయ వ్యాధి వస్తే ఆందోళన చెందవద్దని మందులు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిని దూరం చేయవచ్చన్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ పి.సరిత, వైద్యాధికారులు సుజిత, వినోద్, ఈక్షిత్, సీహెచ్ ఒ.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.


