పి.గన్నవరం: కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, కుల వివక్ష వంటి సంఘటనలు పెరిగాయని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డీబీ లోక్ అన్నారు. కుందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనే దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా, అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లోక్ మాట్లాడుతూ దీనిని ప్రత్యేకమైన సంఘటనగా గుర్తించి, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. వారికి న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. గ్రామంలో ఇరువర్గాలూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలను కాపాడాలని డీబీ లోక్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట దళిత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ములపర్తి సత్యనారాయణ, బొక్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు.


