
సర్వం సిద్ధం
ఆదిలాబాద్: వినాయక చవితి నుంచి భక్తుల విశేష పూజలందుకున్న గణేశుడు గంగమ్మ ఒడికి చేరేవేళ ఆసన్నమైంది. శనివారం నిర్వహించనున్న నిమజ్జనోత్సవానికి మున్సిపల్, పోలీస్ శాఖలు ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమా రు 2వేల విగ్రహాలు ప్రతిష్ఠించగా ఇప్పటికే 3, 5, 7, 9 రోజుల్లో 1,550 ప్రతిమలను నిమజ్జనం చేశారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా 450 గణపతి విగ్రహాలు నిమజ్జనానికి తరలాయి.
శిశుమందిర్ నుంచి శోభాయాత్ర..
జిల్లా కేంద్రంలోని వినాయక చౌక్లో హిందూ స మాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద ఉదయం 10గంటలకు ప్రత్యే క పూజలు నిర్వహించి ఎంపీ, కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు శోభాయాత్రను లాంఛనంగా ప్రారంభిస్తా రు. దశాబ్దాలుగా ఇక్కడ ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. భక్తులు భక్తి గీతాలు, భజన కీర్తనలు, సాంస్కృతిక నృత్యాల మధ్య ఇక్కడి నుంచే శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
పోలీస్శాఖ నిరంతర నిఘా
వేడుకలు శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా కేంద్రంలో 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 350 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎనిమిది క్లస్టర్లు, ఎనిమిది సెక్టార్లుగా విభజించి సిబ్బందికి విధులు కేటాయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 23 పికెట్స్ ఏర్పాటు చేసి అధికారులతో పాటు స్ట్రైకింగ్ ఫోర్సు, 15మంది సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. ప్రధాన రోడ్లలో రూఫ్ టాప్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 15 మంది కెమెరా సిబ్బందిని నియమించనున్నారు. మొత్తంగా జిల్లా కేంద్రంలో 15 మంది సీఐలు, నలుగురు డీఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రం సమీపంలోని చాందా టీ వాగు, పెన్ గంగా వద్ద మహిళా సిబ్బందిని నియమించారు. ఇదే విషయమై తన కార్యాలయంలో ఎస్పీ శుక్రవారం డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, జీవన్రెడ్డి, సీఐలు, ఎస్సైలు తదితరులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
శోభాయాత్ర ఇలా..
పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా శోభాయాత్ర సాగుతుంది. వినాయక్ చౌక్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర ఓల్డ్ బస్టాండ్, అశోక్రోడ్, దేవిచంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, శివాజీచౌక్, ఠాకూర్ హోటల్ మీదుగా సాగనుంది. పాత జాతీయ రహదారిపై నుంచి చాందా వంతెనతో పాటు, అది దాటి నేషనల్ హైవే–44 మీదుగా పెన్ గంగాకు చేరుకోనుంది. ఈ మేరకు ఈ రూట్లో ఇప్పటికే ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పూర్తయింది. ఇటీవల కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ రూట్ మ్యాప్ పరిశీలించారు.
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో..
పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇదివరకే రహదారుల మరమ్మతు పనులు చేపట్టారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి వసతి కల్పించనున్నారు. తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. గణపతి విగ్రహాల నిమజ్జనం జరిగే చాందా టీ, పెన్ గంగా వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. లైటింగ్ సిస్టం ఏర్పాటు సిద్ధం చేశారు. ఈ రెండు చోట్ల గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు.

సర్వం సిద్ధం