breaking news
vijayajyoti
-
నా రూ.3కోట్లు తిరిగి ఇచ్చేయండి
-
నా రూ.3కోట్లు తిరిగి ఇచ్చేయండి: టీడీపీ అభ్యర్థి
సాక్షి, కడప : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తన ఓటమిని ఖరారు చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగిన డాక్టర్ రాజశేఖర్ ....పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన బద్వేల్లో పరాజయం తప్పదని భావించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్గా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి...(భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి ) దీంతో తన ఓటమి ఖాయమని నిర్థారించుకున్న రాజశేఖర్ నిన్న తన కుటుంబసభ్యులతో సమావేశం అయ్యారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే అంశంపై చర్చించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే టికెట్ కోసం తాను ఇచ్చిన రూ.3 కోట్లు తిరిగి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బద్వేల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సమయంలో రాజశేఖర్ ఉదంతం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. టీడీపీలో అవమానించారు వైయస్సార్ జిల్లా బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయజ్యోతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్నంత కాలము తనను చిత్ర హింసలకు గురిచేశారని, అవమానించారని వాపోయారు. టీడీపీ మోసం చేయడంతో ఆ పార్టీని వదిలిపెట్టినట్టు చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు. చదవండి...(టీడీపీలో చల్లారని అసమ్మతి) -
ఏయ్.. ఇది టీడీపీ ప్రభుత్వం
బద్వేలు: ‘ఏయ్ ఇది ఎవరి ప్రభుత్వం... టీడీపీ ప్రభుత్వంలో పని చేస్తూ మేం చెప్పినట్లు వినరా... మీరు తగిన ఫలితం అనుభవిస్తారు’... అని బద్వేలు టీడీపీ నేత విజయజ్యోతి అధికారులపై మండిపడ్డారు. బుధవారం పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఎటువంటి ఆహ్వానం లేకుండానే టీడీపీ నేత విజయజ్వోతి హాజరయ్యారు. అనంతరం తాను మాట్లాడతానంటూ మైక్ ఇవ్వాలని కోరారు. దీనికి మండలాధ్యక్షుడు చిత్తా విజయప్రతాప్రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆమెను ఏ హోదాలో మాట్లాడిస్తారు.. ఇదేమీ పార్టీ కార్యక్రమం కాదు.. ప్రభుత్వ కార్యక్రమం కదా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. దీంతో అధికారులు ఆమెకు అవకాశమ్విలేదు. ఇదే సమయంలో జిల్లాలోని ఉన్నతాధికారులతో అధికారులకు ఫోన్ చేయించి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ఆమె మరింత అసహనానికి గురయ్యారు. తాను ప్రజల తరుఫున మాట్లాతానని పట్టుబట్టడంతో ప్రజలకు మధ్యాహ్నం అవకాశమిస్తామని అప్పటి వరకు ఆగాలన్నారు. దీంతో టీడీపీ నేతలు ఆమెకు మాట్లాడే అవకాశమివ్వాలని కోరుతూ మైక్ అందజేశారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ చిత్తా విజయప్రతాప్, వైఎస్సార్సీపీ నాయకులు చిత్తా రవి, రమణ ఆందోళనకు దిగారు ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి ప్రయత్నించడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం విశేషం. ఈ దశలో సీఐ వెంకటకుమార్, ఎస్ఐలు కృష్ణంరాజు నాయక్, హరిప్రసాద్ గొడవను సద్దుమణిగేలా చూశారు. పింఛన్ల పంపిణీ పూర్తయ్యాక విజయజ్యోతి ఎంపీడీఓ నారాయణరెడ్డి, నోడల్ అధికారి కృష్ణమూర్తి వద్దకు వెళ్లి ‘మీరు మా ప్రభుత్వంలో పని చేస్తున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీని పరవ్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుందని వారిపై మండిపడటంతో కార్యక్రమానికి వచ్చిన పలువురు అధికారులు, ప్రజలు అవాక్కయ్యారు. -
బాహాబాహీ
- రచ్చకెక్కిన బద్వేలు ‘దేశం’ ఇన్ ఛార్జి రగడ - జిల్లా అధ్యక్షుని సయోధ్య యత్నం విఫలం - వాగ్వాదాలు, తోపులాటలతో ఉద్రిక్తంగా మారిన టీడీపీ కార్యాలయం - ఇన్ఛార్జిని ప్రకటించని లింగారెడ్డి బద్వేలు అర్బన్: బద్వేలు తెలుగుదేశం పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. నియోజకవర్గ ఇన్చార్జి కోసం విజయమ్మ, విజయజ్యోతిల మధ్య జరుగుతున్న రగడ తారస్థాయికి చేరింది. ఇరువురిని సమన్వయ పరిచేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు చేసిన సయోధ్య యత్నం విఫలమైంది. ఇరువర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి సిద్ధమయ్యారు. తీవ్ర తోపులాటలు, దూషణల నడుమ టీడీపీ కార్యాలయం ఉద్రిక్తంగా మారింది. బుధవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి సమక్షంలో జరిగిన ఈ రచ్చకు బద్వేలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదిక అయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బ్యాంక్ మేనేజర్ విజయజ్యోతి పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ చూస్తుండేవారు. విజయజ్యోతికి ఎన్నికల్లో విజయమ్మ సహకరించలేదని విజయజ్యోతి వర్గీయులు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. విజయమ్మ కూడా పార్టీకోసం కష్టపడి పనిచేశాను. తానే ఇన్చార్జిగా ఉంటానంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలకు విజయమ్మ, విజయజ్యోతి వేర్వేరుగా పాల్గొంటూ వచ్చారు. అయితే ఇటీవల విజయజ్యోతికి ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినట్లు, అందుకు ఆమె వర్గీయులు సంబరాలు జరుపుకున్నట్లు ఓ దినపత్రిక(సాక్షికాదు)లో ప్రచురితమైంది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి బుధవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరువురు నేతలను సమావేశ పరిచారు. విజయమ్మ, విజయజ్యోతి వర్గీయులు కార్యాలయం ఎదుట భారీగా మోహరించారు. సుమారు నాలుగు గంటలపాటు ఇరువురితో చర్చలు జరిపిన లింగారెడ్డి ఇరువురు సమన్వయంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈ సమయంలో విజయజ్యోతి బయటకు వచ్చి తన వర్గీయులతో జరిగిన విషయం చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ర్టమంతటా ఎన్నికల్లో ఓడిపోయిన వారినే ఇన్చార్జిలుగా నియమిస్తుంటే ఒక బద్వేలులో మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నారంటూ లింగారెడ్డిపై మండిపడ్డారు. ఈ దశలో విజయమ్మ వర్గీయులు సైతం ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న విజయమ్మను కాదని నిన్న, మొన్న వచ్చిన విజయజ్యోతికి ఇన్చార్జి బాధ్యతలు ఎలా ఇస్తారని లింగారెడ్డిని ప్రశ్నించారు. ఈ సమయంలో విజయమ్మ, విజయజ్యోతి వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. ఒకానొక దశలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. సర్దిచెప్పేందుకు వెళ్లిన లింగారెడ్డిని ఇన్నేళ్లు పార్టీ గురించి విజయమ్మ ఏమాత్రం పట్టించుకోనప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్లారు, మీకు మాట్లాడే అర్హత లేదు అంటూ కలసపాడు మండలానికి చెందిన దివంగత సీనియర్ నాయకుడి కుమారుడు వాగ్వాదానికి దిగారు. విజయజ్యోతిని సమావేశంలోకి రావాల్సిందిగా లింగారెడ్డి కోరినప్పటికీ ఆమెను లోపలికి పోనివ్వకుండా ఆమె వర్గీయులు అడ్డుకున్నారు. ఒక దశలో విజయమ్మ జిందాబాద్, విజయజ్యోతి జిందాబాద్ అంటూ ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం విజయజ్యోతితో మరోసారి మాట్లాడిన లింగారెడ్డి ఆమెను విలేకర్ల సమావేశంలోకి తీసుకువచ్చారు. ఇంత రచ్చ జరిగినా ఇన్చార్జి విషయం ఎటూ తేల్చకపోవడంతో కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. అయితే విజయమ్మ బంధుగణమైన సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి ఇది టీడీపీ కార్యాలయం కాదు, విజయమ్మ ఇళ్లు. మర్యాదగా బయటకు వెళ్లండంటూ తన వర్గీయులను అనడం ఎంతవరకు సమంజసమని విజయజ్యోతి లింగారెడి ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇరువురు సమన్వయంతో పనిచేయాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ విజయమ్మ, విజయజ్యోతిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరువురు కూడా పార్టీకోసం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ మేరకు ఇరువురితో మాట్లాడినట్లు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్చార్జిలను ప్రకటించలేదని, రాష్ట్రవ్యాప్తంగా తమ అధినేత ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారో, అలాగే బద్వేలులో కూడా అమలు పరుస్తామని తెలిపారు. అలాగే అధిష్టానం నిర్ణయించిన నిర్ణయానికి ఇరువురు కూడా కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు మున్సిపాలిటీతో పాటు బద్వేలు రూరల్, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, కలసపాడు, కాశినాయన,పోరుమామిళ్ల మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.