breaking news
Union Minister Abbas Naqvi
-
‘రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ విందు’
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ తొలిసారిగా బుధవారం ఇఫ్తార్ విందు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా బుధవారమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రాంతీయ పార్టీలను కూడగడుతున్న తరుణంలో కాంగ్రెస్ రెండేళ్ల తర్వాత ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తుండటంతో.. అందుకు పోటీగానే బీజేపీ కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తోందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై స్పందించిన ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘ రాజకీయ ప్రయోజనాల కోసమే రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఏవిధంగానూ మేము(బీజేపీ) కాంగ్రెస్తో పోటీ పడటం లేదు. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తనకు తానుగా ట్రిపుల్ తలాక్ బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న విందు ఇది’ అని వ్యాఖ్యానించారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ తాజ్ ప్యాలెస్ హోటల్లో ఏర్పాటు చేసిన విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు హాజరవుతారని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, నారా చంద్రబాబు నాయుడు సహా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. -
ఒక సంస్కరణగానే చూడాలి
గోవధ నిషేధ చట్టంపై కేంద్ర మంత్రి అబ్బాస్ నక్వీ - తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని ధీమా సాక్షి, హైదరాబాద్: గోవధ నిషేధ చట్టాన్ని మతపరంగా కాకుండా ఓ సంస్కరణగా మాత్రమే చూడాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. పశువులను ఎలాంటి నియంత్రణ లేకుండా ఎక్కడికక్కడ వధిస్తుండడంతో ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబం ధిత సమస్యలు వస్తున్నాయన్నారు. గోవధను కొందరి మనోభావాలతో ముడిపడిన అంశంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే పశువుల మార్కెట్ను వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ చర్యలను చేపట్టిందన్నారు. దేశంలో సమాఖ్య వ్యవస్థ అమల్లో ఉందని, చాలా రాష్ట్రాల్లో ఈ నిషేధ చట్టం అమల్లో ఉన్నా కొన్ని రాష్ట్రాలు అమలు చేయడంలేదన్నారు. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, చింత సాంబమూర్తి, యెండల లక్ష్మీనారాయణ, కృష్ణసాగర్రావు తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే బీఫ్ పార్టీలంటూ ఆవులను వధించి బహిరంగంగా ప్రదర్శించడం దేశ సామరస్యతను దెబ్బతీస్తుందని, ఇటువంటి నేరపూరిత చర్యలను ప్రభుత్వం ఉపేక్షించేది లేదని నక్వీ స్పష్టం చేశారు. మోదీ పాలనకు డిస్టింక్షన్...: మూడేళ్ల మోదీ పాలన అర్ధసంవత్సర పరీక్షలనుకుంటే.. వందకు వంద శాతం మార్కులతో డిస్టింక్షన్లో పాసైందన్నారు. తమ మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో వచ్చే అక్టోబర్ 15 (భారతరత్న అబ్దు ల్ కలాం జయంతి) నుంచి దేశంలోని వంద జిల్లాల్లో ‘తెహరీక్ ఏ తాలీమ్’కింద ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రభుత్వ హాస్టళ్లు, పీహేచ్సీలలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలోని 1.82 కోట్ల మంది విద్యార్థులకు రూ.4,740 కోట్ల మేర స్కాలర్షిప్లను పంపిణీ చేశామన్నారు. ఇక్కడా బీజేపీ అధికారంలోకి వస్తుంది తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందనే ధీమాను ముక్తార్ అబ్బాస్ వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీతో, బీజేపీకి తెలంగాణతో అవసరం ఉందన్నారు. తమ పాలనలో చెప్పుకోవడానికి ఏమి లేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ముందుకు తెచ్చిం దన్నారు. రాజ్యాంగబద్ధత లేనందున ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల గురించి అమిత్షా చెబుతుంటే ఇక్కడి ప్రభుత్వానికి కోపం వస్తోందన్నారు. ఈ లెక్కలను తాము అడగడం లేదని, ప్రజలే ప్రశ్నిస్తున్నారని అన్నారు.