breaking news
Train Protection System
-
రెల్వేకు రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,445 రూటు కిలోమీటర్లను కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించారు.‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రైల్వేశాఖ ఈ కవచ్ ప్రాజెక్టును చేపట్టింది. గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో 859 కిలోమీటర్లను కవచ్ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఈ పరిధిని 1,445 కిలోమీటర్లకు విస్తరించారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) ఆధ్వర్యంలో ‘కవచ్’ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడం, రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా నియంత్రించడం, ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయినా బ్రేకింగ్ వ్యవస్థ ఆటోమెటిక్గా పని చేయడం కవచ్ సాంకేతికతలోని ప్రత్యేతలు. దశలవారీగా అభివృద్ధి.. దక్షిణమధ్య రైల్వే కవచ్ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేసింది. మొదట ‘వాడి’ నుంచి వికారాబాద్ వరకు, సనత్నగర్– వికారాబాద్ – బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్ల పరిధిలో 264 కిలోమీటర్ల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం అదనంగా 32 స్టేషన్లకు, 322 కిలోమీటర్లకు విస్తరించారు. గత ఏడాది కవచ్ను మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్లకు పొడిగించారు. ప్రస్తుతం కవచ్ వ్యవస్థ 133 రైల్వేస్టేషన్లు, 29 ఎల్సీ గేట్లను, 74 లోకోమోటివ్లను కవర్ చేస్తూ 1,445 కిలోమీటర్లకు విస్తరించినట్లయింది. ప్రత్యేకతలివీ.. రైళ్లు, లోకోమోటివ్లు ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడాన్ని కవచ్ నివారిస్తుంది. సిగ్నలింగ్ తాజా స్థితిగతులను నిరంతరం డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్ (డీఎంఐ), లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానెల్ (ఎల్పీఓసీఐపీ)లో– అధిక వేగ నియంత్రణకు ఆటోమెటిక్ బ్రేకింగ్ వ్యవస్థగా కవచ్ పని చేస్తుంది. రైళ్లు లెవల్ క్రాసింగ్ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటో విజువలింగ్ వ్యవస్థగా ఇది అప్రమత్తం చేస్తుంది. నెట్వర్క్ మానిటర్ సిస్టం ద్వారా రైలు నడిచే మార్గాలపై ప్రత్యేక కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుంది. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
‘టీకాస్’ సఫలం
తాండూరు: ఓ ట్రాక్లో రైలు ఆగి ఉంది.. అదే ట్రాక్లో ఎదురుగా మరో ప్రత్యేక రైలు సుమారు వంద కి.మీ. వేగంతో దూసుకొచ్చింది.. రైల్వే ప్లాట్ఫాంపై ఉన్న ఇతర అధికారులు, సామాన్య ప్రయాణికులు ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తున్నారు.. ఇంతలోనే ప్రత్యేక రైలు ఇంజిన్లోని ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం (ఏటీపీఎస్)తో ఆగి ఉన్న రైలుకు సుమారు 100-150 మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ ప్రయోగానికి తాండూరు రైల్వేస్టేషన్ వేదికైంది. సోమవారం రైల్వే బోర్డు సభ్యుడు ఏకే మిట్టల్ (ఎలక్ట్రికల్), బోర్డు అడిషినల్ మెంబర్లు మహేష్మంగళ్ (టెలీకమ్యూనికేషన్స్), మనోహరన్ (సిగ్నల్స్)తోపాటు సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్కే మిశ్రా, వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ప్రయోగాలను పరిశీలించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వారంతా తాండూరు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. ఏటీపీఎస్ (టీకాస్) ప్రయోగాలు చేస్తున్న భారత రైల్వే పరిశోధన సంస్థ (ఆర్డీఎస్ఓ) అధికారి మన్సుఖనితో కలిసి రైలు ఇంజిన్లో తాండూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని కుర్గుంట, బషీరాబాద్లోని నవాంద్గీ, మంతట్టి రైల్వేస్టేషన్లలో ఎదురెదురుగా, పక్కపక్క ట్రాక్ల్లో రైళ్లను నడిపి ఏటీపీఎస్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించారు. దాదాపు మూడు రైల్వేస్టేషన్ పరిధిలోని నాలుగు బ్లాక్ సెక్షన్లలో రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏటీపీఎస్లోని 32 ఫీచర్స్ను స్టడీ చేశారు. డ్రైవర్ చేయలేనిది.. ప్రత్యేక రైలు వంద కి.మీ. వేగంతో వెళ్తుండగా.. రెడ్సిగ్నల్ వేయడంతో డ్రైవర్ రైలు వేగాన్ని నియంత్రించలేకపోయాడు. రైలులో ఉన్న ఏటీపీఎస్ ఆటోమెటిక్గా వేగాన్ని నియంత్రించి రైలును సుమారు 100 మీటర్ల దూరంలోనే ఆపేసింది. సిగ్నల్స్, లెవల్క్రాసింగ్లు తదితర చోట్ల ఏటీపీఎస్ పనితీరును, ఇంజిన్లోని డ్రైవర్ ఇంటర్పేస్ మానిటర్లో సిగ్నల్ ఇండికేషన్స్ తదితర అంశాలను బోర్డు సభ్యులు స్వయంగా గమనించారు. ప్రయోగాలు సంతృప్తికరం.. అనంతరం రైల్వే బోర్డు అదనపు సభ్యుడు మహేష్మంగళ్ తాండూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రయోగాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్ను మార్చి, జూన్లలో అమల్లోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించి రెండు సెక్షన్ల మధ్య టవర్లు, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే సుమారు 28 రైల్వేస్టేషన్లలో టవర్లు, ఇతర పరికరాలను అమర్చడం పూర్తయిందన్నారు. రెండేళ్లుగా చేసిన ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు, మూడు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.