ఉర్దూ ద్విపదలుగా గీత శ్లోకాలు
అనువదించిన ఉత్తరప్రదేశ్ రచయిత
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రముఖ ఉర్దూ రచయిత అన్వర్ జలాల్పురి శ్రీమద్భగవద్గీత శ్లోకాలను ఉర్దూలోకి అనువదించారు. ‘ఉర్దూ షాయరీ మే గీత’ అనే ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఈ మధ్యనే ఆవిష్కరించారు. గీతలోని 701 శ్లోకాలను ఆయన 1,761 ద్విపదలుగా ఉర్దూలోకి తర్జుమా చేశారు. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే గీతలోని శ్లోకాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా రాశానని రచయిత జలాల్పురి చెప్పారు. మనిషి కర్తవ్యాన్ని గుర్తు చేసే భగవద్గీతను ఉర్దూలోకి తర్జుమా చేయాలనే తన ఆశ నెరవేరిందని ఆయన తెలిపారు. గీతలో కఠిన శ్లోకాల వల్ల అందులో ఏమి ఉందో ముస్లింలకు, ఉర్దూ భాష చదువుకునే వారు అర్థం చేసుకోలేకపోతున్నారని, అందుకే తానీ కార్యక్రమం చేపట్టానని అన్నారు. అలాగే రెండు మతాలకు చెందిన వారు ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలన్నది తన కోరిక అని రచయిత చెప్పారు.