లారీని ఢీకొట్టిన ఆర్టీసీ : 20 మందికి గాయాలు
ఒంగోలు : లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికిరాయి వద్ద శుక్రవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులతో తిరుపతి వెళ్తోంది.
కలికిరాయి సమీపంలో ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో దానిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశారు.