breaking news
Shiva Singh
-
ఇదేమి బౌలింగ్ బ్రో..?
కళ్యాణి(పశ్చిమబెంగాల్): దక్షిణాఫ్రికా మాజీ స్సిన్నర్ పాల్ ఆడమ్స్ బౌలింగ్ క్రికెట్తో పరిచయం ఉన్న వారికి దాదాపు సుపరిచితమే. అతను స్టార్ స్పిన్నర్ కాకపోయినా, బౌలింగ్ వేసేటప్పుడు తన తలను పూర్తిగా వంచి చిత్రమైన యాక్షన్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆడమ్స్. ఆ తరహా బౌలింగ్ను ఇప్పటివరకూ మనం చూడకపోయినా, అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎంతోమంది బౌలర్ల వింత యాక్షన్ను మనం చూస్తునే ఉన్నాం. బౌలర్ల వింత యాక్షన్ను కొన్నిసార్లు అంఫైర్లు తప్పుబట్టగా... మరికొన్ని సార్లు ఐసీసీ సైతం కలగజేసుకుని బౌలింగ్ తీరుని మార్చుకోవాల్సిందిగా సూచించిన సందర్బాలు అనేకం. ఇలా శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్, విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ అనేక సార్లు అంఫైర్ల వార్నింగ్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. తాజాగా, అండర్-23 సీకే నాయుడు టోర్నీలో భాగంగా ఇటీవల జరిగిన ఓ మ్యాచ్లో 360 డిగ్రీలు తిరిగి బంతి వేశాడు యూపీ స్పిన్నర్ శివ సింగ్. వివరాల్లోకి వెళితే ఉత్తర్ప్రదేశ్, బెంగాల్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కాగా, ఉత్తరప్రదేశ్కు చెందిన లెఫ్టామ్ స్పిన్నర్ శివ సింగ్ కాస్త వింతగా బౌలింగ్ చేశాడు. అతడు 360 డిగ్రీలు తిరిగి మరీ బంతిని విసిరాడు. దాంతో అంపైర్ వినోద్ శేషన్ దానిని డెడ్ బాల్గా ప్రకటించాడు. దీనిపై బౌలర్ నిరసన వ్యక్తం చేయగా ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు అతనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఐసీసీ రూల్స్లో ఇలాంటి చర్యలకు ఏం చేయాలన్న దానిపై ప్రత్యేకంగా ఓ చట్టం అంటూ లేకపోవడంతో అంఫైర్ తీసుకున్న నిర్ణయం సరైందా? లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే చట్టంలో 41.2 ప్రకారం ఓ ప్లేయర్ చర్య సరిగా ఉందా? లేదా తేల్చే హక్కు మాత్రం అంపైర్కు మాత్రమే ఉంది. బ్యాట్స్మన్ ఏకాగ్రతను దెబ్బ తీయడానికి కావాలని బౌలర్ ఇలా చేశాడని అంపైర్ భావించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతను స్వతహాగా ఇదే యాక్షన్తో బౌలింగ్ చేసిన సందర్బాలు లేవు. బ్యాట్స్మన్కు గందరగోళంలో పడేయడానికే ఇలా చేశాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ అన్ని బంతులు అలాగే వేయడానికి సిద్ధమైతే మాత్రం ఆ యాక్షన్తో బౌలింగ్కు అనుమతి ఇవ్వొచ్చని దేశవాళీ అంపైర్ ఒకరు తెలిపారు. Weirdo...!! Have a close look..!! pic.twitter.com/jK6ChzyH2T — Bishan Bedi (@BishanBedi) 7 November 2018 -
వరల్డ్ కప్తోనే తిరిగొస్తానన్నాడు: క్రికెటర్ తల్లి
సాక్షి, లక్నో: పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత క్రికెట్ జట్టు అండర్-19 ప్రపంచ కప్ను సొంతం చేసుకోగా.. కుటుంసభ్యులు క్రికెటర్లతో తమ సంతోషాన్ని షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా సభ్యుడైన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివసింగ్ తల్లి ప్రపంచ కప్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడారు. నా కుమారుడు శివ సింగ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. మేజర్ టోర్నీకి వెళ్లేముందు.. అండర్-19 ప్రపంచ కప్తోనే తిరిగొస్తామని శివసింగ్ అన్నాడు. చెప్పిన ప్రకారంగానే ప్రపంచ కప్ సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన జట్టులో సభ్యుడయ్యాడు. శివ సింగ్ కఠోర శ్రమతో ఈ స్థాయికి వచ్చాడు. భారత జట్టులో చోటు దక్కించుకుని మంచి క్రికెటర్గా రాణించాలన్నదే కుమారుడి ధ్యేయమని శివసింగ్ తల్లి తెలిపారు. భారత్ గర్వించేలా జట్టుకు తన సేవలు అందించాలని శివ సింగ్ తాపత్రాయ పడేవాడన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్లో స్పిన్నర్ శివసింగ్ సైతం రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో పాలు పంచుకున్నాడు. ఆ మ్యాచ్లో తొలుత ఇషాన్ పొరెల్ చెలరేగగా, ఆసీస్ మిడిల్, లోయర్ ఆర్డర్ క్రికెటర్లను శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్లు వెంట వెంటనే ఔట్ చేసి భారత్కు స్వల్ప విజయలక్ష్యం ఉండేలా చేశారు. ఛేజింగ్లో మన్జోత్ కల్రా(101 నాటౌట్;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీకి తోడు హర్విక్ దేశాయ్(47 నాటౌట్; 61 బంతుల్లో 5 ఫోర్లు) రాణించడంతో భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో నాలుగోసారి అండర్-19 వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది.