breaking news
Safety and Emergency Response
-
చల్లార్చే శాఖ.. చతికిల
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికాభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నియంత్రణ, రక్షణ చర్యల్లో పటిష్టంగా ఉండాల్సిన అగ్నిమాపక శాఖ అనేకరకాల సమస్యలు, సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. వేసవి కాలంలో షార్ట్ సర్క్యూట్లు సంభవించి భారీ అగ్నిప్రమాదాలు సైతం చోటు చేసుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఫైర్ డిపార్ట్మెంట్ సన్నద్ధత చర్చనీయాంశమవుతోంది. ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టాన్ని నివారించడంతో పాటు ప్రాణాలు కోల్పోకుండా కృషి చేయాల్సిన అగ్నిమాపక శాఖకు.. తగిన సంఖ్యలో స్టేషన్లు, సిబ్బంది, వాహనాలు, అత్యాధునిక అగ్నిమాపక సాధనాలు లేకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర రాజధానిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అగ్నిమాపక శాఖ దుస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. \ స్టేషన్లు పెంచాల్సిందే.. స్టాండింగ్ ఫైర్ అడ్వయిజరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఏసీ) నిబంధనల ప్రకారం అర్బన్, మెట్రో నగరాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒక ఫైర్ ఇంజన్ అందుబాటులో ఉండాలి. అదే విధంగా ప్రతి 10 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్స్టేషన్ ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 చదరపు కిలోమీటర్లకు ఒక ఫైర్స్టేషన్ ఉండాలని కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. అయితే రాష్ట్రంలో కనీసం 5 లక్షల జనాభాకు ఒక ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా 2016లోనే నిర్ణయం తీసుకొని నిధులు మంజూరు చేసింది. కానీ కొన్నిచోట్ల ఇప్పటివరకు స్టేషన్లు ఏర్పాటు కాలేదు. గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణాన్ని (625 చ.కి.మీ) బట్టి చూస్తే జీహెచ్ంఎసీ పరిధిలో 40–50 వరకు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ 25 ఫైర్ స్టేషన్లే ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి రెండు జిల్లాల్లో ఔట్ పోస్టులతో కలిపి మొత్తం 30 మాత్రమే అగ్నిమాపక కేంద్రాలున్నట్టు ఫైర్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ పేర్కొంది. వాహనాల సంఖ్య మరీ దారుణం అహ్మదాబాద్, పుణెల్లో ఒక్కో ఫైర్స్టేషన్లో కనీసం 6 నుంచి 8 అగ్ని మాపక వాహనాలున్నాయని, రాష్ట్రంలో మాత్రం ఒక్కో స్టేషన్కు ఒకటి చొప్పున మాత్రమే ఉందని తెలిపారు. పరిశ్రమలున్న ప్రాంతాల్లో స్టేషన్ల సంఖ్యతో పాటు వీటి సంఖ్యను కనీసం 3 నుంచి 4కు పెంచితే ప్రమాదాలను త్వరితగతిన నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అత్యాధునిక వాహనం ఒక్కటే: అత్యాధునిక అగ్నిమాపక వాహనం ఒకటే ఉందని, వీటి సంఖ్య అత్యవసరంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 15 ఏళ్లకు పైబడిన అగ్నిమాపక వాహనాలు, పరికరాలు (ఎక్విప్మెంట్) 107 ఉండగా, 15 ఏళ్ల లోపువి 518 ఉన్నట్టు అధికారులు తెలిపారు. వేధిస్తున్న సిబ్బంది, అధికారుల కొరత రాష్ట్ర అగ్నిమాపక శాఖలో మొత్తం 2,256 మంజూరు పోస్టులుండగా, 1,414 మంది ఉద్యోగులు, సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. 842 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అగ్నిమాపక శాఖ వెబ్సైట్ను పరిశీలిస్తే ఒక అదనపు డైరెక్టర్, ఒక రీజనల్ ఫైర్ అఫీసర్, మూడు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారుల పోస్టులతో పాటు కీలకమైన 49 స్టేషన్ ఫైర్ ఆఫీసర్, 212 డ్రైవర్ ఆపరేటర్, 541 ఫైర్ మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మంజూరు పోస్టుల్లో దాదాపుగా 45 శాతం ఖాళీగా ఉండిపోవడం ఉన్నతాధికారులను ఒత్తిడికి గురిచేస్తోంది. అజమాయిషీ లేక ప్రమాదాలు! రాష్ట్రంలో 15 మీటర్ల ఎత్తువరకు భవన నిర్మాణాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అగ్నిమాపక శాఖ నుంచి ఇవ్వాల్సిన అనుమతులను ఆయా మున్సిపల్ అథారిటీలకు ప్రభుత్వం అప్పగించింది. భారీ పరిశ్రమలు, 15 మీటర్ల నుంచి ఆపై ఎత్తులో నిర్మించే భారీ గృహ నిర్మాణాలకు మాత్రమే రాష్ట్ర అగ్నిమాపక శాఖ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇస్తోంది. కాగా కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో డిప్యూటేషన్పై పనిచేసే అగ్నిమాపక శాఖ అధికారులు ఎన్ఓసీ ఇవ్వడం వరకే పరిమితమవడం ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. అనుమతులు మొత్తం అగ్నిమాపక శాఖ నుంచే జరిగితే ఫీల్డ్ వెరిఫికేషన్తో పాటు సేఫ్టీ అడిటింగ్, సేఫ్టీ మెజర్మెంట్స్ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలుంటుందని అంటున్నారు. 90 శాతం నిర్మాణాలు 15 మీటర్ల ఎత్తు వరకే ఉన్నాయని, వాటిపై తమకు పూర్తి అజమాయిషీ ఉండటం లేదని అంటున్నారు. హైరైజ్ అపార్ట్మెంట్స్, ఇతర భారీ పరిశ్రమల్లో మాత్రం ప్రతి ఏటా సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహిస్తున్నట్టు వారు వెల్లడించారు. పేరుకే గ్రేటర్... హైదరాబాద్ నగరంలో ఉన్న అత్యధిక అగ్నిమాపక కేంద్రాల్లో నీటి సంపులే లేకపోవడం ఆ శాఖ దుస్థితిని స్పష్టం చేస్తోంది. రిజర్వా యర్ల వద్ద గానీ, చెరువులు, కుంటల వద్ద గానీ నీటిని నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాత వాహనాలకు తోడు అధునాతన అగ్నిమాపక పరికరాలు లేకపోవడం సమస్యగా మారుతోంది. సికింద్రాబాద్ బోయగూడ స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలను ఆర్పడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న ముషీరాబాద్ ఫైర్ స్టేషన్లో మంటలు ఆర్పడానికి అధునాతన పరికరాలు లేవు. నగరానికి 50 వరకు ఫైర్ స్టేషన్లు అవసరం కాగా అందులో సగం మాత్రమే ఉండటంతో ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించినా, ఒకేసారి రెండు మూడు చోట్లకు ఫైరింజన్లు వెళ్లాల్సి వచ్చినా.. పరిస్థితి ఊహించలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్నాళ్ల క్రితం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగిన ఆగ్ని ప్రమాదం అగ్నిమాపక శాఖలో ఉన్న లోపాలను బయటపెట్టింది. అక్కడ మోహరించిన ఫైరింజన్లలో కొన్నింటిలో నీరు లేకపోవడం, మరికొన్నింటిలో సగమే ఉండడం, ఓ వాహనం వాల్స్ తుప్పు పట్టి ఓపెన్ కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. నగరంలోని ఏ అగ్నిమాపక కేంద్రంలోనూ అగ్ని నిరోధక బాంబులు(ఫైర్ ఎక్సిటింగ్వి షర్ బాంబ్) లేవు. ఈ బాంబులు వినియోగి స్తే మంటలను సత్వరమే అదుపులోకి తీసుకురావచ్చు. -
‘మహా’నగరి...నడిచే దారి?
మేమే రోడ్డు దాటలేకపోతున్నాం మెట్రోపొలిస్ సదస్సులో పోలీసు కమిషనర్లు పాదచారులకు రక్షణ లేదని అంగీకారం అన్ని విభాగాలకూ బాధ్యత ఉందని స్పష్టీకరణ నగర ప్రజల సమస్యలపై స్పందన సాక్షి,సిటీబ్యూరో: ‘హైదరాబాద్లో పాదచారులకు రక్షణ లేదన్న విషయం వాస్తవమే. మేమే రోడ్డు దాటలేకపోతున్నాం.’ అంటూ పోలీసు కమిషనర్లు మహేందర్రెడ్డి, సీవీ ఆనంద్లు అంగీకరించారు. మెట్రోపొలిస్ సదస్సులో బుధవారం సిటీ మేనేజ్మెంట్ సిరీస్లో భాగంగా ‘సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్’ అనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ సమస్య ప్రస్తావనకొచ్చింది. పాదచారుల బతుకులకు రక్షణ లేకుండా పోయిందని, పెరిగినవాహన రద్దీ.. నడిచే దారులు లేకపోవడం.. అడ్డగోలు ఆక్రమణలు తదితరమైన వాటి వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై కమిషనర్లు స్పందిస్తూ ట్రాఫిక్ విభాగం మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేదన్నారు. మున్సిపల్, ఆర్అండ్బీ, జలమండలి తదితర విభాగాలన్నీ సమన్వయంతో పనిచేస్తే తప్ప పరిష్కారం కాదన్నారు. రహదారుల డిజైన్ల దశలోనే పాదచారులకు సదుపాయంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఫుట్పాత్లు పాదచారులు వినియోగించుకునేలా ఫెన్సింగ్ల ఏర్పా టు, జంక్షన్ల అభివృద్ధి, సిగ్నల్ లైట్లు, యూ టర్న్ తదితరమైన వాటి వల్ల తాత్కాలిక పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. జీపీఎస్తో నేరాల అదుపు ఆటోవాలాల వేధింపుల నుంచి మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిగా వచ్చిన విజ్ఞప్తిపై కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి స్పందించారు. ఆటోలతో పాటు ప్రజా రవాణాకు వినియోగించే అన్ని రకాల వాహనాలకూ జీపీఎస్ వ్యవస్థను అమలు చేయాల్సి ఉందన్నారు. తద్వారా నేరాలను అరికట్టవచ్చునన్నారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థులకు అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు ప్రత్యేక హెల్ప్లైన్ నెంబరు అందుబాటులోకి తేవాల్సి ఉందన్నారు. సైబరాబాద్ పరిధిలో దాదాపు 11వేల క్యాబ్లుండగా, 6వేల క్యాబ్లే పోలీస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని చెప్పారు. నగరంలో దాదాపు వెయ్యి జంక్షన్లను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నగరంలోని ట్రాఫిక్, తదితర సమస్యలపై ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ బంజారాహిల్స్లో 22 అంతస్తులతో నిర్మాణమయ్యే భవనంలో ఏర్పాటు చేసే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ వల్ల అన్ని అత్యవసర సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం చట్టాన్ని రూపొందిస్తోందన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీల అమరికతో పాటు వీలైనన్ని ఎఫ్ఓబీలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. పుట్పాత్లపై చిరువ్యాపారుల తొలగింపులో సమస్యలు ఉన్నాయని చెప్పారు. అది జీవనాధారమైనందున సున్నిత సమస్యగా మారిందన్నారు. నగరానికి చెందిన పద్మజ, ఆనంద్, తదితరులు ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ సమస్యలను ప్రస్తావించారు. విపత్తుల నివారణపై శ్రద్ధ విపత్తుల నివారణకు అందుబాటులోని సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవాల్సి ఉందని ఈ అంశంలో నిపుణుడు సుబ్రహ్మణ్యం చెప్పారు. ముందస్తు చర్యల వల్ల ముప్పును తగ్గించవచ్చన్నారు. విపత్తు సమయాల్లో ప్రణాళిక, స్పందించే వేగాన్ని బట్టి ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చునన్నారు.