breaking news
S. suresh kumar
-
ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో విద్యాసంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రేమెర్ ప్రశంసించారు. ఆయన గురువారం చికాగో యూనివర్సిటీలోని డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటో బృందంతో కలిసి రాష్ట్రానికి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం పరిశీలించనుంది. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బృందం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో విద్యాసంబంధ అంశాలపై చర్చించింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. ఈ బృందం మూడురోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యావ్యవస్థపై చికాగో యూనివర్సిటీ బృందం పరిశోధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) బాగుందని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తింపులేని పాఠశాలల్లో పిల్లల్ని చేర్చొద్దు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించకుండా తల్లిదండ్రులను చైతన్యపరిచే బాధ్యత విద్యాశాఖాధికారులపైనే ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్కుమార్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ సురేశ్కుమార్ గురువారం ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలకు సంబంధించిన అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో పిల్లలను చేర్పించరాదని తల్లిదండ్రులకు సూచించారు. మండలాల వారీగా గురిం్తపు లేని పాఠశాలల జాబితాను విద్యాశాఖ కార్యాలయాల్లో బహిరంగ పర్చాలని ఎంఈవోలను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశామని, ఏ విద్యార్థికైనా పుస్తకాలు అందకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలు తెరిచిన రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో మధ్యాహ్న భోజన పథకాన్ని తప్పనిసరిగా అమలుపర్చాలని, ఇందుకు జిల్లాకు రూ.ఆరు కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఈ నిధులతో ఏజెన్సీలకు బిల్లుల చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా బియ్యం కోటాను పాఠశాలలకు పంపి, మరుసటి నెల కోటాకు ముందుగానే సమీక్షించుకోవాలని పౌర సరఫరాల సంస్థ అధికారులను కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో వంటశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 14 మోడల్ స్కూళ్లలో 13 నిర్మాణం పూర్తి చేసుకుని, వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈపూరులో స్థల సేకరణ సమస్యతో నిలిచిన మోడల్ స్కూల్ నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఎంఈవోలకు మెమోలు.. పొన్నూరు, చేబ్రోలు, నిజాంపట్నం, నగరం మండలాల్లో విద్యార్థులకు గత విద్యాసంవత్సరం యూనిఫాం ఇప్పటి వరకూ పంపిణీ చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మండలాల ఎంఈవోలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. 2014-15 విద్యాసంవత్సరానికి 2,66,340 మంది విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉందని చెప్పారు. జిల్లాలో డ్రాపౌట్లుగా గుర్తించిన 2,221 మందిని పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. వసతుల కల్పన వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ కె. నాగేశ్వరరావు, పాఠశాల విద్య ఆర్జేడీ పి. పార్వతి, డీఈవో డి. ఆంజనేయులు, రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి డాక్టర్ టి. శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో సుబ్బారావు, పంచాయతీ రాజ్ ఎస్ఈ సూర్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.