మన్యంపై ముప్పేట దాడి
ఈమె పేరు చోడెం సంకురమ్మ. నాలుగు నెలల గర్భిణి. వయసు 26. వేలేరుపాడు మండలం చిగురుమామిడిలో అత్తవారింటో ఉండే సంకురమ్మ వారం రోజుల క్రితం బుట్టాయగూడెం మండలం పాలకుంట గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. ఇక్కడ జ్వరం బారినపడింది. తల్లి ముత్తమ్మ, తండ్రి లక్ష్ముడు వెంటనే సంకురమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. జ్వరం తగ్గకపోగా తీవ్రరూపం దాల్చింది. దీంతో జంగరెడ్డిగూడెంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఏలూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఏలూరులోని ఒక ప్రై వేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ సంకురమ్మకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి మలేరియా, టైఫాయిడ్, కామెర్లతోపాటు సెరిబ్రల్ మలేరియా కూడా ఉన్నట్టు గుర్తించారు. ముత్తమ్మ, లక్ష్ముడు దంపతులు దొరికిన చోటల్లా రూ.లక్ష అప్పు చేసి 5 రోజులపాటు చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం ఆమె మృత్యువాతపడింది. ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించారు.
===
బుట్టాయగూడెం : మన్యంపై మలేరియా, టైఫాయిడ్, విషజ్వరాలతోపాటు కామెర్లు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఒక్క బుట్టాయగూడెం మండలంలో ఇప్పటికే ఇద్దరు మృత్యువాతపడగా, తాజాగా మరో ఇద్దరు మరణించారు. వారిలో ఒక మహిళ నాలుగు నెలల గర్భిణి. వేలేరుపాడు మండలం చిగురుమామిడి నుంచి తన పుట్టిలై ్లన బుట్టాయగూడెం మండలం పాలకుంట గ్రామానికి వచ్చిన గర్భిణి చోడెం సంకురమ్మ మలేరియా, టైఫాయిడ్, కామెర్లు, సెరిబ్రల్ మలేరియాతో శనివారం వృత్యువాతపడింది. తీవ్ర జ్వరంతో బాధపడిన సంకురమ్మకు ఐదు రోజులపాటు వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు ముత్తమ్మ, లక్ష్ముడు రూ.లక్ష అప్పు తెచ్చి ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయింది. అలాగే పైదావారిగూడెంకు చెందిన పైదా నారాయణ (32) కామెర్లతో బాధపడుతూ మతి చెందాడు. నారాయణ మూడు రోజులుగా జ్వరం, కామెర్ల బారిన పడటంతో బుట్టాయగూడెం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. సంకురమ్మ, నారాయణ మృతదేహాలకు ఆయా గ్రామాల్లో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.
20 రోజుల్లో నలుగురు
బుట్టాయగూడెం మండలంలో ఈ రెండు తాజా ఘటనలతో జ్వరాల బారినపడి మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. మండలంలోని మారుమూల గ్రామమైన మోతుగూడెంకు చెందిన పట్ల చిన్నారెడ్డి(40) ఈ నెల 17న తీవ్రమైన జ్వరం, మలేరియా, టైఫాయిడ్, కామెర్లతో మతి చెందాడు. ఇదే మండలంలోని జైనవారిగూడెంకు చెందిన కె.ప్రవీణ్ (13) అనే బాలుడు కామెర్లతో బాధపడుతూ మృతి చెందాడు.
జిల్లా వ్యాప్తంగా 3,74,459 జ్వరాల నమోదు
ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 80 ప్రభుత్వ ఆసుపత్రులలో 3,74,459 జ్వర పీడితుల కేసులు నమోదయ్యాయి. జ్వర పీడితులకు పరీక్షలు చేయించగా, 547 మలేరియా కేసులు, 3,440 టైఫాయిడ్ కేసులు బయటపడ్డాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వాసుపత్రుల్లో నమోదైన కేసులు మాత్రమే. ప్రై వేట్ ఆసుపత్రుల్లో మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల పరిధిలోని 14 పీహెచ్సీలలో 35 వేలకు పైగా జ్వరపీడితులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. కామెర్లకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రై వేటు ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటున్న వారే సుమారు 98 మంది ఉన్నట్టు సమాచారం.
డెంగీ కేసులూ ఉన్నాయి
జిల్లాలో ఇప్పటివరకు 6 డెంగీ కేసులు నమోదైనట్టు సమాచారం. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు బయటకు వెల్లడించడం లేదు. వేలేరుపాడు మండలం రాగాయిగూడెంలో ఒక వ్యక్తికి డెంగీబారిన పడగావైద్యాధికారులు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. జ్వరాల బారినపడిన వారిని గుర్తించేందుకు 19 బృందాలను నియమించి సర్వే చేయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.