breaking news
Rain gauge
-
ఇక లంబసింగి.. లెక్క పక్కా..!
సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశీ్మరుగా ఖ్యాతి గడించింది. ‘0’(సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. శీతాకాలంలో లంబసింగిలో ‘జీరో’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట! అంటూ జనం తరచూ విశేషంగా చర్చించుకుంటారు. కానీ ఆ లెక్క పక్కా కాదని ఎంతమందికి తెలుసు? అక్కడ ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతాన్ని గాని నమోదు చేసే యంత్రాంగం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్)లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల కంటే లంబసింగిలో రెండు డిగ్రీలు తక్కువగా రికార్డయినట్టు చెబుతున్నారు. ఉదాహరణకు చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే లంబసింగిలో ‘0’ డిగ్రీలు రికార్డయినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది. లంబసింగిలో ఏఆర్జీ.. తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) స్టేషన్ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద ‘సాక్షి’కి చెప్పారు. సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో.. లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్లా గడ్డ కట్టుకుపోతుంది. అంతేకాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది. కొర్రబయలు నుంచి లంబసింగి.. లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు. -
వర్షం ఎంత కురిసింది ఎలా లెక్కిస్తారో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఒక్కోసారి కాస్త వాన పడుతుంది.. ఒక్కోసారి కుండ పోతగా కురుస్తుంది. అధికారులేమో.. పది సెంటీమీటర్లు పడింది.. 15 సెంటీమీటర్లు పడింది అని చెప్తుంటారు. మరి ఈ లెక్కలు ఎలా తీస్తారో తెలుసా..? ఇందుకు వాడేది రెయిన్ గేజ్గా పిలిచే ఓ చిన్నపాటి పరికరమే. ఓ చిన్నపాటి గాజు సీసా, దాని లోపలికి ఉండే ఓ గాజు గరాటు, దానిపై ఉండే మిల్లీమీటర్, సెంటీమీటర్ల కొలతలు.. అంతే. నిర్దిష్ట ప్రదేశాల్లో, నిర్ణీత ఎత్తులో ఈ రెయిన్ గేజ్లను ఏర్పాటు చేస్తారు. వాన కురిసినప్పుడు పైన ఉన్న గరాటు ద్వారా గాజు సీసాలోకి నీళ్లు చేరుతాయి. ఆ నీళ్లు ఎంత ఎత్తున చేరితే.. అన్ని సెంటీమీటర్లు/ మిల్లీమీటర్లు వాన పడిందన్న మాట. చెట్లు, భవనాలకు సమీపంలో, అటూఇటూ గాలి మళ్లేలా ఉన్న ఎగుడు దిగుడు ప్రదేశాల్లో రెయిన్ గేజ్లను ఏర్పాటు చేస్తే తప్పుడు లెక్కలు వస్తాయి. అందుకే విమానాశ్రయం వంటి విశాలమైన, చుట్టూ ఖాళీ ఉండే ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు. -
వరద కాల్వలను పట్టించుకోండి
మరిన్ని రెయిన్గేజ్లు ఏర్పాటు చేయాలి: మర్రి శశిధర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అధికారులకు, నేతలకు కొత్త ప్రాజెక్టులపై ఉన్నంత శ్రద్ధ... ఉన్నవాటి సక్రమ నిర్వహణపై ఉండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యం కారణంగా ముంచుకువస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం నగరాలపై ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు వరదనీటి కాల్వల నిర్వహణను సక్రమంగా చేపట్టాలన్నారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడంపై ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గురువారం ఇక్కడ సదస్సు నిర్వహించింది. ఇందులో శశిధర్రెడ్డి మాట్లాడుతూ... నగరీకరణతో అక్కడికక్క డ అధిక వేడిమి ఉన్న ప్రాంతాలు ఎక్కువవుతున్నాయని,ఫలితంగా నగరాల్లో తక్కువ సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతోందన్నారు. హైదరాబాద్లో కనీసం 150 వరకూ రెయిన్ గేజ్లు ఏర్పాటు చేసి, ఏటా వర్షా కాలానికి మునుపే వరద నీటి కాల్వల్లో పూడికలు సక్రమంగా తీస్తే వరదముప్పును గణనీయంగా తగ్గించవచ్చన్నారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో తగిన భాగస్వామ్యాలు ఉండాలని అమెరికా ప్రభుత్వ కార్యక్రమం స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇనిషియేటివ్స్ డెరైక్టర్ సుబ్రమణియన్ చెప్పారు. ఈఎస్సీఐ డెరైక్టర్ డి.ఎన్.రెడ్డి, పర్యావరణవేత్త కె.పురుషోత్తమ్రెడ్డి, ఈఎస్సీఐ సెంటర్ ఫర్ క్లైమెట్ చేంజ్ సలహాదారు బి.వి.సుబ్బారావు పాల్గొన్నారు.