‘ముసలమ్మ’ మురిసింది!
నీటితో కళకళలాడుతున్న చెరువు
మోర్తాడ్ ,బాల్కొండ :వర్షాకాలం ప్రారంభం ముందు వరకు బోసిపోయి కనిపించిన ‘ముసలమ్మ’ చెరువు ప్రస్తుతం నీటితో కళకళలాడుతోంది. 200ఏళ్ల చరిత్ర కలిగిన చెరువు ఈ ఏడాది వేసవిలో తొలిసారి ఎండిపోయిందని రైతులు తెలిపారు. అయితే వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో చెరువులోకి నీరు వచ్చి చేరింది. 24ఫీట్ల లోతు వరకు నీటి నిలువ సామర్థ్యం గల ఈ చెరువులోకి 16ఫీట్ల మట్టం వరకు నీరు చేరింది. సుమారు 167 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ చెరువు ద్వారా 1,600 ఎకరాలకు సాగునీరందుతుంది. మిషన్కాకతీయ ద్వారా చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు సరిపోవనే ఉద్దేశంతో ట్రిపుల్ ఆర్ పథకం ద్వారా కేంద్ర నిధుల కోసం అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. దాదాపు రూ.3.50కోట్ల వ్యయంతో చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులు భావిస్తున్నారు.