breaking news
private conductors
-
ప్రైవేట్ కండక్టర్ల చేతికి టికెట్ మెషిన్లు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సుల్లో అడ్డగోలు చార్జీలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ప్రైవేట్ కండక్టర్లు, డ్రైవర్లు ఎక్కడికక్కడ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దోపిడీకి పాల్పడుతుండడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రవాణాశాఖ అప్రమత్తమైంది. ఆర్టీఏ అధికారులు నగరంలో పలు చోట్ల శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఆర్టీసీ గ్రేటర్ జోన్ సైతం చర్యలు తీసుకుంటోంది. సమ్మెపై కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక సిబ్బంది విధులను పటిష్టం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది. మరో రెండు రోజుల్లో విద్యార్థులకు సెలవులు ముగియనున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. శివార్లలోని ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. కానీ ఈలోగా సమ్మె ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అందుబాటులో ఉన్న బస్సులన్నింటిలో టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్)ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటి వినియోగంపై ప్రైవేట్ కండక్టర్లకు శిక్షణనిచ్చి రెగ్యులర్ సిబ్బంది తరహాలో వారి సేవలు వినియోగించుకోనున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బస్సుల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణనివ్వాలని అధికారులు భావిస్తున్నారు. ‘టిమ్స్’తో సేవలు పారదర్శకం... ప్రస్తుతం టికెట్ల జారీ విధానం లేకుండా ప్రయాణికుల నుంచి ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. పైగా ప్రయాణికుల నుంచి వసూలు చేసిన చార్జీల్లోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏ రూట్లో ఏ కండక్టర్ నుంచి ఎంత ఆదాయం వచ్చిందనే విషయంపై అధికారులకు అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రైవేట్ కండక్టర్లు కచ్చితంగా టికెట్ మెషిన్లను వినియోగించే విధంగా తర్ఫీదు ఇవ్వడమే మంచిదని అధికారులు ఒక అవగాహనకు వచ్చారు. టికెట్ల జారీతో దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో ఆయా రూట్లలో ఎన్ని టికెట్లు జారీ అయ్యాయి? ఎంత ఆదాయం వచ్చిందనే అంశంపై కూడా స్పష్టత వస్తుంది. అలాగే సిటీ బస్సుల నిర్వహణపై డ్రైవర్లకు కూడా అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం సుమారు 2,500 మంది కండక్టర్లు, డ్రైవర్లు తాత్కాలిక పద్ధతిన పని చేస్తున్నారు. శుక్రవారం నాటికి 1300 బస్సులను రోడ్డెక్కించినట్లు అధికారులు తెలిపారు. మరో 2,300లకు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అధికారుల హెచ్చరిక... ప్రయాణికుల నుంచి చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెహిదీపట్నం ప్రాంతీయ రవాణా అధికారి సీపీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శీతల్ చౌహాన్ బృందం అక్కడి బస్టాప్ వద్ద తనిఖీలు నిర్వహించింది. మెహిదీపట్నం నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లను సీరియస్గా హెచ్చరించింది. ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు తీసుకుంటే డ్యూటీలోకి తీసుకోబోమని, నేరుగా ఇంటికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఖైరతాబాద్, అమీర్పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, కార్ఖానా తదితర ప్రాంతాల్లో ఆర్టీఏ బృందాలు తనిఖీలు చేపట్టాయి. కండక్టర్ల వద్దనున్న టికెట్ చార్ట్లను పరిశీలించారు. చార్ట్ ప్రకారమే డబ్బులివ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు. -
ఇక అద్దె బస్సులు.. ప్రైవేటు కండక్టర్లు
కదిరి: గత పాలనలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి విశ్వప్రయత్నం చేసిన బాబు..ప్రస్తుతం పాత ఆలోచనకు బూజు దులుపుతున్నట్లు కనిపిస్తోంది. ఆర్టీసీ ప్రైవేటు పరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాపకింద నీరులా వ్యవహారం నడుపుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 795 అద్దె బస్సులకు టెండర్లు ఆహ్వానించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 108 అద్దె బస్సులను తీసుకుంటున్నారు. 2016 జనవరి 5 నుంచి ఆయా రీజనల్ కార్యాలయాల్లో ఈ టెండర్లు నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆయా రీజనల్ కార్యాలయాల్లో టెండర్ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. టెండర్ దక్కించుకున్న వారికి జనవరి 6 నుంచి ఆయా రూట్లు అప్పగిస్తారు. టెండర్ నిబంధనల్లోని కాలం నెంబర్ 25, 28, 29, 30ను పరిశీలిస్తే అద్దె బస్సుల్లో డ్రైవర్తో పాటు కండక్టర్ బాధ్యతలు కూడా ప్రైవేటు వ్యక్తులకే అప్పగించనున్నారు. ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఒక బస్సుకు 2.5 మంది చొప్పున 2 బస్సులకు 5 మంది(డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ సిబ్బంది)ని తీసుకోవాలనే నిబంధనలున్నాయి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 795 అద్దె బస్సులను తీసుకుంటున్నారంటే 1987.5 మంది నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నమాట. ఆర్టీసీలో ఉద్యోగాలు చేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్టీసీలో ఉద్యోగ అవకాశం కల్పించాలనే నిబంధన ఉంది. ఇలా అద్దె ప్రాతిపదిన బస్సులను తీసుకుంటూ పోతే వీరికి ఉద్యోగం కల్పించే అవకాశమే లేదు. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అర్థం చేసుకోవచ్చు.