breaking news
Press conferences
-
ప్రజల కోసమే ప్రశ్నించే స్వేచ్ఛ
తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఒక అంతిమ భావనకు వచ్చేశారు. నిజానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలను కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ఏ అంశం మీద ప్రశ్నలు అడగాలన్నదీ, ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. పత్రికా సమావేశాన్ని నిర్వహించడానికి దేశ ప్రధాని సుముఖంగా ఉన్నారంటే ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు ఆయన సంసిద్ధతను కనబరుస్తున్నారని ఇండియాలో మనం భావిస్తాం. ప్రధానికి నిజంగానే తన పాలనకు బాధ్యత వహించే ఉద్దేశం ఉందా, లేదా అనేదానికి అసలైన పరీక్ష... ఆయన ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, లేదా చేయకపోవడం. పత్రికా సమావేశంలో వందలాది మంది పాత్రికేయులకు ముఖాముఖి బదులు ఇవ్వవలసి వచ్చినప్పుడు కఠినమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డొంక తిరుగుడు లేకుండా సమాధానాలు చెప్పవలసి వస్తుంది. అందుకే తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలంలో మోదీ ఒక్కసారి కూడా పత్రికా సమావేశాన్ని నిర్వహించలేదనీ, జవాబుదారీతనం నుంచి ఆయన తప్పించుకోవాలని చూస్తున్నారనీ అనేకమంది ఇప్పటికే ఒక అంతిమ భావనకు వచ్చేశారు. మార్గరెట్ థాచర్ను ఇంటర్వ్యూ చేస్తున్న బ్రియాన్ వాల్డెన్స్ వారి భావనతో ఒక్క క్షణమైనా నాకు నిమిత్తం లేనప్పటికీ, పత్రికా సమావేశాన్ని మోదీ దాటవేస్తూ రావడంపై నాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ప్రపంచంలోని మిగతా ప్రజాస్వామ్య దేశాలలో నిజమైన జవాబుదారీతనాన్ని భిన్న పాత్రికేయ ప్రక్రియల ద్వారా సాధిస్తారు. ఆ విషయానికి తర్వాత వస్తాను. మొదట, పత్రికా సమావేశాల మీద మనకుండే విశ్వాసం ఎందుకు సన్నగిల్లుతున్నదో నన్ను వివరించనివ్వండి. మొదటి విషయం. పత్రికా సమావేశంలో అనేక మీడియాల నుంచి వచ్చిన అనేకమంది ప్రతినిధులు ఉంటారు. వారిలో ప్రతి ఒక్కరూ తమదైన ప్రశ్న ఒకటి అడిగేందుకు ఆతురతతో ఉంటారు. చాలా వరకు అవన్నీ ఒక దానితో ఒకటి సంబంధం లేని వేర్వేరు ప్రశ్నలే అయి ఉంటాయి. గంటల పాటు పత్రికా సమావేశం జరుగుతున్నా ఈ వేర్వేరు ప్రశ్నల కారణంగా ప్రధానమంత్రి జవాబులు చెప్పడానికి ఎప్పుడో తప్ప ఒత్తిడికి లోనయే అవకాశం దాదాపుగా ఉండదు. ప్రధాని ఎందుకు ఒత్తిడికి లోనవరో చెప్తాను చూడండి. ప్రధాని పత్రికా సమావేశాలలో ఒక జర్నలిస్టుకు ఒక ప్రశ్న వేయడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒక జర్నలిస్టు ఒక ప్రశ్న అడిగాక, ఆ తర్వాతి జర్నలిస్టు తిరిగి అదే ప్రశ్న అడిగేందుకు ఉండదు. అప్పుడు ఆ జర్నలిస్టు తన ప్రశ్నను, ఒక్కోసారి తన సబ్జెక్టును కూడా మార్చుకోవలసి వస్తుంది. అంటే ఒకటే ప్రశ్నపై పట్టుపట్టడానికి తక్కువ అవకాశం ఉండటంతో ప్రధానిపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆయన పొంతన లేని, లేదా సంపూర్ణం కాని సమాధానాలతో తప్పించుకోవచ్చు. ప్రధాని అజాగ్రత్తతో తొట్రుపడితేనో, లేదంటే ఏవైనా అవాస్తవాలు ఆయన నుంచి దొర్లితేనో తప్ప ఆయన పట్టుబడరు. అది నక్క తోకను తొక్కడమే కానీ, నాణ్యమైన జర్నలిజం కాదు. నిజానికి ప్రధాని పత్రికా సమావేశాన్ని టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా చూస్తున్నప్పుడు ఆయన ఒక నేర విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిగా కనిపిస్తారు. కానీ అది భ్రమ. ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతూ, ఆయన ఇచ్చే సమాధానాలను నిశితంగా పరిశీలించి వాటిలోని తప్పుల్ని, దాటవేతల్ని ఎత్తి చూపుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. అయితే ప్రధాని పత్రికా సమావేశాలలో ఇలా జరిగే అవకాశం ఉండనే ఉండదు. అందుకే పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు తమ నాయకులను ప్రజలకు జవాబుదారీగా చేసేందుకు పత్రికా సమావేశాలకు కాక, ‘రాజకీయ ఇంటర్వ్యూ’లకు ప్రాముఖ్యం ఇస్తాయి. ప్రధాని–జర్నలిస్ట్ ఇద్దరే ఎదురెదురుగా ఆ ఇంటర్వ్యూలో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఆ ఏక పాత్రికేయుడే... ప్రధాని జవాబులు చెప్పవలసిన ప్రశ్నలను నిర్ణయిస్తారు. ఏ అంశం మీద ప్రశ్నలు లేవనెత్తాలన్నదీ, అలాగే ఏ ప్రశ్నపై విడుపు లేకుండా పట్టుతో ఉండాలన్నదీ ఆ జర్నలిస్టు నియంత్రణలోనే ఉంటుంది. ఒక ప్రశ్నకు ప్రధాని నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు ఆ ప్రశ్నను కొనసాగించే హక్కును ఆ పాత్రికేయుడు కలిగి ఉంటాడు. నిజాన్ని నిగ్గు తేల్చే విధానం అది. అలాంటి జర్నలిస్టు విషయాలన్నీ బాగా తెలిసినవాడై, నిర్భీతి, దృఢచిత్తం గలవాడై ఉండాలని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కచ్చితంగా అయితే అతడు ప్రధాని ముందు నీళ్లు నమలనివాడై ఉండాలి. జిహ్వకు చాపల్యాన్ని అంటించే రుచికరమైన బ్రిటిష్ రాజకీయ వర్గ అసంబద్ధ అంతర్గత కథనాలతో రాబ్ బర్లీ అనే బ్రిటిష్ టీవీ ప్రొడ్యూసర్ తాజాగా వండి వార్చిన ‘వై ఈజ్ దిస్ లైయింగ్ బాస్టర్డ్ లైయింగ్ టు మి?’ అనే పుస్తకంలో ఇలా రాశారు: ‘‘రాజకీయ ఇంటర్వ్యూలు అనేవి అధికారంలో ఉన్నవారిని ప్రజలకు పూచీ పడేలా చేయడానికే తప్ప, నాయకులకు లబ్ధిని చేకూర్చడానికి కాదు. అవి ఉన్నది ప్రజా ప్రయోజనాల కోసం.’’ దేశ అత్యున్నత పదవికి అభ్యర్థులైన వారి యోగ్యతను రాజకీయ ఇంటర్వ్యూల ద్వారా ఎలా అంచనా వేయవచ్చో బర్లీ ఈ పుస్తకంలో చెబుతున్నప్పటికీ, ఇప్పటికే అధికారం మాటున దాగి ఉన్నవారికి కూడా ఆయన మాట వర్తిస్తుంది. ‘‘అటువంటి ఇంటర్వ్యూలు మన రాజకీయ సంస్కృతి స్వభావం, సమర్థత, విశ్వసనీయతలను బహిర్గతం చేయడానికి తోడ్పడే ఉత్తమ సాధనాలు. వాటి గురించి మనం గట్టిగా అడగాలి.’’ మోదీ కూడా రాజకీయ ఇంటర్వ్యూలు ఇచ్చారు. నిజానికి చాలానే ఇచ్చారు. ప్రశ్న ఏమిటంటే, ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు ఎలాంటివారు? ఎలాంటి అంశాలను వాళ్లు ప్రధాని ముందు లేవనెత్తారు? ఎంత త్వరగా వాళ్ల ప్రశ్నల గేలం ప్రధానిని విడిచిపెట్టింది? ఈ ప్రశ్నలన్నిటి సమాధానాల కోసం మునుపటి ఇంటర్వ్యూలను చూడండి. అవి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. ఆ ఇంటర్వ్యూలు మోదీ తనేం చెప్పదలిచారో అవి చెప్పడానికీ, తరచూ ప్రతిపక్షాలను విమర్శించడానికీ కానుకగా అందివచ్చిన వేదికలు. బ్రిటిష్ బ్రాడ్క్యాస్టర్లు జెరెమి పాక్స్మ్యాన్, బ్రియాన్ వాల్డెన్స్ తమ రాజకీయ ఇంటర్వ్యూల కారణంగానే ప్రత్యేకంగా నిలిచిపోయారు. వాల్డెన్ తన సంధింపులతో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ను గుక్క తిప్పుకోకుండా చేశారు. పాక్స్మ్యాన్ అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి మైఖేల్ హోవర్డ్ను అడిగిన ప్రశ్ననే పన్నెండుసార్లు అడిగి ఆయన్ని గుటకలు వేయించారు. రెండు ఇంటర్వ్యూలలో అవి ముగిసే సమయానికి థాచర్, హోవర్డ్ సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. చెప్పకపోవడం కాదు, చెప్పలేకపోవడం! ఆ చెప్పలేకపోవడమే ప్రజలకు వారిని జవాబుదారీగా చేసింది. మన ప్రధానులను కూడా ఇంత కఠినంగా, కనికరం లేకుండా ప్రశ్నించగల రోజు వస్తే, మన రాజకీయాలలో నాటకీయమైన మార్పును చూస్తాం. మన రాజకీయ నాయకులు మారతారు. మనతో అబద్ధాలు చెప్పడం మానేస్తారు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
నెలాఖర్లోగా పీసీసీ ప్రక్షాళన
గ్రేటర్, రంగారెడ్డి,నిజామాబాద్, ఖమ్మం డీసీసీలకు త్వరలో కొత్త అధ్యక్షులు సాక్షి, హైదరాబాద్: మండలం నుంచి రాష్ట్ర స్థాయిదాకా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఈ నెలాఖరులోగా పునర్ వ్యవస్థీకరించాలని ఏఐసీసీ ఆదేశించింది. ఖాళీగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, ఖమ్మంలకు నూతన అధ్యక్షుల నియామక ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. గ్రేటర్, రంగారెడ్డి అధ్యక్షులను రెండు మూడు రోజుల్లో ప్రకటించనుంది. పార్టీ కార్యక్రమా ల్లో చురుకుగా లేని మండల స్థాయి నేతల స్థానంలో కొత్తవారికి అవకాశమివ్వాలని కూడా పీసీసీకి సూచించింది. ముఖ్యమైన అనుబంధ విభాగాలతో సహా ఖాళీగా ఉన్న మండలాల్లోనూ నూతన కమిటీలు వేయనున్నారు. పీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షుల నియామకం జరిగి ఏడాది దాటినా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటుచేయలేదు. భారీగా ఉన్న ప్రస్తుత సంఖ్యను కనీస స్థాయికి కుదించాలని ఏఐసీసీ సూచించింది. దాదాపు 100 మంది పీసీసీ కార్యదర్శులుండగా వారిని 10కి పరిమితం చేయాలని, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధుల సంఖ్యనూ భారీగా కుదించాలని సూచనలందాయి. మండల, జిల్లా, పీసీసీ ఖాళీలను నెలాఖర్లోగా భర్తీ చేయనున్నారు. తరవాత, గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలతో పాటు క్షేత్రస్థాయిలో కూడా ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధమవ్వాలని ఏఐసీసీ ఆదేశించింది. 20న ఎస్సీ సదస్సు 20వ తేదీన ఏఐసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో భారీ సదస్సును హైదరాబాద్లో నిర్వహించనున్నారు. ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, ఎస్సీ సబ్ ప్లాన్, సంక్షేమం తదితరాలపై టీఆర్ఎస్ తీరుపై క్షేత్రస్థాయిలో కార్యాచరణ ఎలా ఉండాలో ఇందులో చర్చించనున్నారు. ఏప్రిల్లో మైనారిటీ సదస్సు కూడా నిర్వహించనున్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయకపోవడంపై పోరాటానికి పీసీసీ సన్నద్ధమవుతోంది. అధికార ప్రతినిధులకు శిక్షణ జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలపై పీసీసీ అధికార ప్రతినిధులకు అవగాహన కోసం శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. మీడియా సమావేశాలు, సదస్సులు, ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చల వంటివాటిలో పాల్గొనడానికి ఒక ప్యానెల్ను పీసీసీ సిద్ధం చేస్తోంది. ఆ జాబితాను అన్ని మీడియా సంస్థలకూ పంపనుంది. ప్యానెల్లోని వారి వ్యాఖ్యలే కాంగ్రెస్ వైఖరిని ప్రతిబింబిస్తాయంటూ వాటికి లేఖలు కూడా రాయనుంది. -
అది రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే
సాక్షిని అనుమతించకపోవడం పట్ల ప్రెస్ కౌన్సిల్ సీరియస్ ఏపీ సీఎం విలేకరుల సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణకినిరాకరణ {పెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిన పాత్రికేయ సంఘాలు విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు కన్వీనర్గా రాజీవ్ రంజన్ నాగ్ సభ్యులుగా కె.అమర్నాథ్,{పజ్ఞానంద్ చౌధురి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, సాక్షి న్యూస్ చానల్, టీ న్యూస్ చానల్ విలేకరులను అనుమతించకపోవడాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) తీవ్రంగా పరిగణించింది. విలేకరులకు అనుమతి నిరాకరించడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. ఈ అంశాన్ని విచారించి నివేదిక ఇవ్వడానికి వీలుగా ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రెస్ కౌన్సిల్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. రాజీవ్ రంజన్ నాగ్ కన్వీనర్గాను ఈ కమిటీలో కె.అమర్నాథ్, ప్రజ్ఞానంద్ చౌధురి సభ్యులుగా నియమితులయ్యారు. కమిటీ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్వహించే విలేకరుల సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికల అక్రిడిటెడ్ రిపోర్టర్ల అనుమతిని నిరాకరిస్తున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఈ రెండు పత్రికలు, చానెళ్ల ప్రతినిధులకు అనుమతి నిరాకరిస్తున్న విషయాన్ని నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఇండియా) ఈనెల 20న, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 22న వినతిపత్రాలు సమర్పించాయి. విలేకరులను ప్రెస్ కాన్ఫరెన్సులు కవర్ చేయకుండా నియంత్రించడంవల్ల మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని ప్రెస్ కౌన్సిల్ చైర్మన్గా నేను భావిస్తున్నాను. రెండు పత్రికలు, టీవీ చానళ్ల పట్ల ఏపీ ప్రభుత్వం వివక్ష చూపడం ద్వారా రాజ్యాంగంలోని అధికరణ 19 (1)(ఎ) ప్రసాదించిన వాక్ స్వాతంత్య్రానికి భంగం కలిగించింది. మీడియాకు సమాచారాన్ని నిరాకరించడం ద్వారా ప్రజలకు సమాచారం తెలుసుకొనే హక్కునూ హరించింది. ఇవి హక్కుల ఉల్లంఘనలే. ఈ అంశంపై విచారించి వీలయినంత త్వరగా నాకు నివేదిక ఇవ్వడానికి వీలుగా రాజీవ్ రంజన్ నాగ్ (కన్వీనర్), కె.అమర్నాథ్(సభ్యుడు), ప్రజ్ఞానంద్ చౌధురి(సభ్యుడు)తో కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. విచారణ చేపట్టడానికి సొంత విధానాన్ని కమిటీ రూపొందించుకోవాలి. విలేకరులను అనుమతించే విషయంలో ఉన్న నిషేధం/ఇబ్బందులు/అవరోధాలను తొలగించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయాలి. ఇందుకు సంబంధించిన వారిని, అధికార వర్గాలతో కమిటీ సమావేశం కావాలి. అవసరమైన సహాయ సహకారాలను అధికార వర్గాలు అందించాలి. కమిటీ విషయంలో ఎవరూ, జోక్యం చేసుకోకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలి’’ అని కట్జూ పేర్కొన్నారు.