-
ఆధ్యాత్మిక, సాహితీ కేంద్రంగా బమ్మెర: సీఎం
సాక్షి, హైదరాబాద్: కవిగా, సాహితీవేత్తగా, తెలంగాణగడ్డ మీద నుంచి పోతనామాత్యులు చేకూర్చిన సాహితీశోభ తెలుగు సాహిత్యచరిత్రలో అజరామరమైనదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఈ మేరకు పోతన జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. పోతన జన్మస్థలమైన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఆయన జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషకు, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తున్నదని కేసీఆర్ అన్నారు. ‘బాల రసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ ’’అంటూ ఆత్మాభిమానం కలిగిన కవిగా, తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరాముడికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతన అని కేసీఆర్ కొనియాడారు. పోతన అందించిన పద్య గుళికలు భక్తి మాధుర్యాన్ని, భాషా పాండిత్య రసాన్ని పంచుతాయని పేర్కొన్నారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో శ్రీకృష్ణ తత్వాన్ని సామాన్యులకు చేర్చిన పోతన ప్రజాకవి అని సీఎం అన్నారు. కర్ణపేయమై తన్మయత్వంలో ముంచెత్తడం పోతన విలక్షణశైలి అని పేర్కొన్నారు. పోతన పద్యాన్ని వినని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదన్నారు. -
పోతన చిరునవ్వు
‘‘ఇదేమిటి బావా ఇలా రాశావు? ఆయుధాలూ పరివారమూ లేకుండా శ్రీమహావిష్ణువు అక్కడికి వెళ్లి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు’’ అన్నాడు ఎగతాళిగా. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఒకరోజు శ్రీనాథుడు తన కూతురిని వెంట పెట్టుకొని మందీ మార్బలంతో కలిసి పోతన యింటికి వచ్చాడు. ఆ సమయంలో పోతన.. భాగవతంలో గజేంద్ర మో„ ఘట్టాన్ని రాస్తున్నాడు. శ్రీనాథుడు.. ‘‘ఏమి రాస్తున్నావు బావా?’’ అంటూనే తాళపత్రాన్ని చేతిలోకి తీసుకొని పైకి గట్టిగా చదివాడు. సిరికిన్ జెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడే / పరివారంబును జీరడ భ్రగ పతిన్ బన్నింపడాకర్ణి కాం / తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో / పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావ నోత్సాహియై .. .. అని చదివి గట్టిగా నవ్వాడు. ‘‘ఇదేమిటి బావా ఇలా రాశావు? ఆయుధాలూ పరివారమూ లేకుండా శ్రీమహావిష్ణువు అక్కడికి వెళ్లి గజేంద్రుడిని ఎలా రక్షించాలనుకున్నాడు’’ అన్నాడు ఎగతాళిగా. పోతన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తర్వాత అంతా భోజనాలకు కూచున్నారు. సగం భోజన మయ్యాక పోతన కొడుకు పరిగెత్తు కుంటూ వచ్చి ‘‘మామయ్యా మీ కూతురు బావిలో పడిపోయింది’’ అని చెప్పాడు. శ్రీనాథుడు ‘అయ్యో’ అంటూ గబుక్కున లేచి ఎంగిలి చెయ్యి కూడా కడుక్కోకుండా పెరట్లోకి పరుగెత్తుకొని వెళ్లి బావి లోకి తొంగి చూస్తూ ‘‘అమ్మా సుశీలా సుశీలా’’ అని పిలుస్తున్నాడు. అంతలోనే చెట్టు చాటునుంచి ‘‘ఏమిటి నాన్నా’’ అంటూ పరిగెత్తుకొచ్చింది సుశీల. ‘‘ఇదేమి సరసం బావా?’’ అన్నాడు శ్రీనాథుడు కోపంగా. అప్పుడు పోతన ‘‘బావా! నీ కూతురు బావిలో పడిందని వినగానే అలాగే చేయి కూడా కడుక్కోకుండా, నీ వెంట వచ్చిన నీ సేవకులను పిలవకుండా, తాడూ బొక్కెన లేకుండా నీవెలా పరిగెత్తుకొని వచ్చావు? పిల్లనెలా కాపాడుదామనుకున్నావు? నీ బిడ్డ పట్ల నీకెంత ఆతురత ఉన్నదో భక్తులు ఆపదలో వుంటే భగవంతుడు కూడా అంతే. ఆయన దేవుడు కనుక ఆయన వెంట శంఖమూ, చక్రమూ గద పరివారమూ అంతా వచ్చారు. ఆ చక్రంతో మొసలిని ఖండించి గజేంద్రుడిని రక్షించాడు. భగవంతుడికి తన నిజమైన భక్తుల పట్ల అంత ఆర్తి వుంటుంది’’ అన్నాడు పోతన. అప్పుడు శ్రీనాథుడు పోతనను క్షమించమని అడిగాడు. – డి.వి.ఆర్. -
నేత్రపర్వం.. సీతారాముల కల్యాణం
ఒంటిమిట్ట కోదండరామాలయంలో సీతారాముల కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. వేకువజామున ఆలయంలోని మూలవిరాట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన పట్టువస్త్రాలు, వివిధరకాల పుష్పాలతో స్వాములవారిని సుందరంగా అలంకరించారు. ఆలయ మధ్యమండపంలో సీతారాముల విగ్రహాలను సుందరంగా అలంకరించిన కల్యాణవేదికపై కొలువుదీర్చారు. వైభవంగా కల్యాణం నిర్వహించారు. సుండుపల్లి నుంచి పాదయాత్రగా వచ్చిన భక్తులు చేపట్టిన భజన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కోదండరామాలయంలో పోతన సాహితీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పద్యరచన పోటీలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలనుంచి దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం చేశారు. -
సాంస్కృతిక కేంద్రాలే నివాళులు
తెలుగు భాషా, సంస్కృతులకు కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. వారి జన్మ స్థలాలనుఅభివృద్ధి పరడడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయం. పాశ్చాత్య దేశాలు తమ చారిత్రక, సాంస్కృతిక రంగాలను మలుపు తిప్పిన మహా పురుషుల స్మారక స్థలాలను భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలా అభివృద్ధి పరిచాయి. మన దేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర, సంస్కృతులున్నాయి. ఇక్కడి సంస్కృతి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాచరిక వ్యవస్థ కొనసాగిన కాలంలోనూ ప్రజలు దాన్ని ప్రతిఘటించారు. ఒక జాతి చరిత్ర, సంస్కృతులు ఒక్క రోజులో నేర్పితేనో, నేర్చుకుంటేనో వచ్చేవి కావు. అవి ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తాయి. తెలంగాణలో ప్రజా సంస్కృతికి నాంది పలికిన యుగకర్తలు పాల్కురికి సోమన, బమ్మెర పోతన. సమైక్య రాష్ట్రంలో ఇక్కడి కవులకు, కళాకారులకు సముచిత స్థానం దక్కలేదన్నది వాస్తవం. పైగా మన సాహితీ వేత్తలకు తమ ప్రతిభ, పాటవాల పట్ల ఉదాసీనత కూడా ఉంది. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండటమూ ఈ సంస్కృతి ప్రత్యేకతే కావచ్చు. తెలుగు భాషా, సంస్కృతులకు ఒక కొత్త చూపును, రూపును అందించిన సోమన్న, పోతనలు తెలంగాణ తత్త్వాన్ని తీర్చిదిద్దిన యుగ పురుషులు. ఎక్కడో కన్నడ ప్రాంతంలో వ్యాపించిన వీర శైవాన్ని ఆలంబనగా చేసుకొని, నన్నయ నుంచి సంప్రదాయబద్ధంగా వస్తున్న మార్గ కవితని కాదని దేశీ కవిత్వానికి పట్టం కట్టిన ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. కుల, మత, ప్రాంత, లింగ వివక్షతలకు అతీతంగా సాహిత్య సృజన కావించి సామాజిక వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు, బడుగు బలహీన వర్గాలకు సాహిత్య స్థాయిని, స్థానాన్ని కల్పించిన వైతాళికుడాయన. సోమన, పోతనలకు మధ్య 200 సంవత్సరాల అంతరం ఉన్నా, భావజాలంలో అదే గుణాత్మకమైన మార్పు సాగడం విశేషం. సింగ భూపాలుని ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని రాచరిక వ్యవస్థను నిరసిస్తూ ‘ఇమ్మనుజేశ్వరాధముల్’ , ‘ధనమధాందుల కొలువేల తాపసులకు’ అనటం పోతనకే చెల్లింది. నన్నయ ఇత్యాధి కవులు రాజాస్థానాలలో ఉంటే సోమన, పోతనలు ప్రజాస్థానంలో నిలిచారు. అదే వీరి ప్రత్యేకత. వందల ఏళ్ళ క్రితమే ఇంతటి మహత్తరమైన భావజాలాన్ని తమ సాహిత్యం ద్వారా ప్రజలకు అందించిన మహాకవులను వారి జన్మ స్థలాలను విస్మరించి, వారి జయంతులను తూతూ మంత్రంగా ఇంత వరకు పట్టణాలలోనే జరిపారు. 1994లో నాటి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య పేర్వారం జగన్నాథం వ్యక్తిగత చొరవ తీసుకొని పాలకుర్తిలో రెండు రోజులపాటు సోమనాథుని అర్ధ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. మహాకవుల జన్మ స్థలాలైన పాలకుర్తి, బమ్మెరలను చూడాలని ఎంతోమంది రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి సాహితీ ప్రియులు, పరిశోధకులు, ధార్మికులు వచ్చి ఆ గ్రామాలలో నెలకొన్న దయనీయ పరిస్థితులను చూసి చలించి పోతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వాటి అభివృద్ధి దిశగా ముందడుగు వేయడం హర్షణీయం. ప్రధానంగా ఈ కర్తవ్యాన్ని పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారిపై కేసీఆర్ ఈ బాధ్యత మోపారు. సాహిత్య సాంస్కృతిక రంగాలంటే నిత్యం తపించే రమణాచారి కృషితో సోమన, పోతన నడయాడిన ప్రదేశాలు గొప్ప సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా మారుతాయి. పవిత్ర స్థలాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం కన్నా, వాటిని పరిశోధనా కేంద్రాలుగా మార్చడం మంచిది. భాషా, సంస్కృతుల పరిరక్షణకు, పరిశోధనకు అవి నెలవులు కావాలి. తెలంగాణ భాష, చరిత్ర, సంస్కృతులు ప్రతిబింబించేలా అక్కడ ఒక మ్యూజియంలను ఏర్పాటు చేయాలి. నాటి నుంచి నేటి వరకు వచ్చిన సాహిత్యాన్ని ఆ ప్రాంతాలలోనే గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, వాటిలో భద్రపరచాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో మరుగున పడిపోయిన మన కళారూపాలను వెలికి తీసేందుకు ఆడిటోరియంలను కూడా నిర్మించాలి. ఆ గ్రామాల్లోనీ మహాకవుల స్మారక చిహ్నాలను పరిరక్షించాలి. కేంద్ర ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాచీన హోదాను కల్పించిన నేపథ్యంలో తెలంగాణ కవుల రచనల్లోని విశేషాలను విశ్లేషించాలి. పాలకుర్తి, బమ్మెర గ్రామాలను సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే మన భాషను, సంస్కృతిని సంరక్షించిన వారిమవుతాం. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశానికి అభినందనలు. లండన్ పక్కన్నే ఉన్న షేక్స్పియర్ జన్మ స్థలాన్ని ఒక పుణ్య స్థలంగా చూస్తారు. చైనాలో, అనేక లాటిన్ అమెరికన్ దేశాలలో కవులను సాంస్కృతిక రాయబారులుగా చూస్తారు. మా వూరు పక్కననే బమ్మెర ఉంటుంది. కాబట్టి ఆనాటి మండలి చైర్మన్ చక్రపాణిని బమ్మెర తీసుకుపోయాను. బమ్మెర పోతన సమాధి దగ్గరకు కాలిబాటన నడచుకుంటూ పోయాం. ఆ మట్టిని చక్రపాణి తన సంచిలో వేసుకుని గర్వంగా వెళ్లాడు. ఇతర దేశాలలో మహాకవుల సమాధులను గొప్పగా చూసుకుంటారు. అలాంటి సత్కార్యాలకు ఆర్థిక వ్యవస్థ దోహదం చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇక్కడి కవులను తమ గుండెల్లో దాచుకున్నారు. ఇప్పటికీ బమ్మెరలోని గ్రామ బావిని పోతన బావి అనే ప్రజలు పిలుచుకుంటారు. ప్రజల నోటి నుంచి వచ్చే ఆ మాటే ఆ మహాకవికి నిత్య సన్మానం. పాల్కురికి సోమనాధుడు రాసిన కావ్యం తను నివసించే గుట్టకు, ప్రకృతికే అంకితమిచ్చారు. అందుకే ఇప్పుడది పాలకుర్తి సోమనాథుని గుట్ట అయ్యింది. వాల్మీకి కావ్యం అంకితమిచ్చింది వల్మిడికి అంటారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగానే గాక సాంస్కృతిక కేంద్రంగా మార్చాలి. అక్కడ ఒక పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి. - వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు చుక్కారామయ్య -
జ్ఞానం కోసం జపించాలి
శ్లోకనీతి పోతన రచించిన భాగవతంలోని కొన్ని పద్యాలనైనా నేర్చుకోవడం తెలుగువారి కనీస కర్తవ్యం. పద్యాలను కేవలం కంఠోపాఠంగా కాకుండా, మనసుకి అర్థం చేసుకుని, అందులోని అంతరార్థాన్ని గ్రహించి అప్పుడు ఆ పద్యం నేర్చుకుంటే, అది చిరకాలం మన మదిలో పదిలంగా నిలిచిపోతుంది. పద్యం-2 క్షోణి తలంబునన్ నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవ చిత్త వశీకరైణె క వాణికిన్ వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్ వ్యాఖ్యాన భావం... సరస్వతీదేవి అవిశ్రాంతంగా... సుకుమారములైన తన నాలుగు చేతులలో క్రమంగా జపమాల, చిలుక, పద్మం, పుస్తకం ధరించి దర్శనమిస్తుంది. సరస్వతీదేవి చదువుల తల్లి. అందువల్లే చదువుకు, విజ్ఞానానికి ప్రతీకగా తన హస్తాలలోని జపమాల ద్వారా... నిరంతరం జ్ఞానాన్ని సముపార్జిస్తూ, మృదువాక్కులు జపిస్తూ ఉండాలని చూపుతోంది. ఇక చిలుక... గురువులు చెప్పిన విద్యను చిలుక వలె పలకాలని అంటే తీయగా, మృదుమధురంగా పలకాలని సూచిస్తోంది, పద్మం వలె వికసిత వదనాలతో స్వచ్ఛమైన హృదయంతో పుస్తకాన్ని చేతబూని జ్ఞానాన్ని సముపార్జించినప్పుడు వారు సరస్వతీదేవిలాగే జ్ఞాన సంపన్నులవుతారని అమ్మవారి అలంకారాలు బోధిస్తున్నాయి. మంచికి మారుపేరయిన దేవతలను రక్షించటం ద్వారా, ఎంతటివారైనా మంచికి అన్యాయం జరుగుతుంటే తప్పక వారిని రక్షించాలని తెలుపుతోంది. తన ఇంపైన మృదుమధుర వచనాల ద్వారా... సత్యాన్నే పలకమని సూచిస్తోన్న సరస్వతీమాతకు సాష్టాంగపడి నమస్కరిస్తున్నాను అన్నాడు పోతన ఈ పద్యంలో. - డా. పురాణపండ వైజయంతి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement