breaking news
parliamentary secrataries
-
ఆప్ సరే.. ఆ బీజేపీ ఎమ్మెల్యేల సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ : లాభదాయక పదవులతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో.. ఛత్తీస్గఢ్లోని 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారం తెరపైకి వచ్చింది. వారి పై కూడా వేటు వేయాల్సిందేనన్న డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతోంది. ‘‘ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్యలు సబబు అయినప్పుడు ఇక్కడ(ఛత్తీస్గడ్) బీజేపీ ఎమ్మెల్యేలపై కూడా వేటు పడాల్సిందే. కానీ, రెండేళ్లుగా ఈ వ్యవహారంపై ఎటూ తేల్చకుండా నానుస్తున్నారు. ఈ వ్యవహారంలో గవర్నర్ కూడా భాగస్వామి కావటం దారుణం’’అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మహ్మద్ అక్బర్ సోమవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు. గతంలో రమణ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై వేటు వేయాలని కాంగ్రెస్ నేత అక్బర్ 2016లో ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. సమాధానమిచ్చిన ఈసీ.. ఒకవేళ గవర్నర్ సిఫార్సు చేస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. దీంతో ఆయన గవర్నర్ బలరామ్జీ దాస్ టండన్కు కూడా ఓ లేఖ రాశారు. గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో గతేడాది ఛత్తీస్గఢ్ హైకోర్టులో అక్బర్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తక్షణమే పార్లమెంటరీ కార్యదర్శుల అధికారాలను ఉపసంహరించుకోవాలని రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రభుత్వం మొక్కుబడిగా ఆ ఆదేశాలను అమలు చెయ్యటంతో ప్రస్తుతం వారంతా మంత్రుల మాదిరిగానే లాభాలను(కారు, బంగ్లా, తదితరాలు) అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆప్ ఎమ్మెల్యేలపై వేటు పడటంతో.. బీజేపీ ఎమ్మెల్యేల సంగతిని కాంగ్రెస్ ప్రస్తావిస్తోంది. ప్రభుత్వం కూలిపోతుందనే... ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 49 మంది, కాంగ్రెస్ పార్టీకి 39 మంది, బీఎస్పీ ఒకరు, స్వతంత్ర్య అభ్యర్థి ఒకరు ఉన్నారు. ఒకవేళ ఆ 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఆ భయంతోనే బీజేపీ గవర్నర్తో కలిసి రాజకీయాలు నడుపుతోందని అక్బర్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గవర్నర్ జోక్యం చేసుకోవాలని.. అలాకానీ పక్షంలో రాష్ట్రపతిని కలిసి జోక్యం చేసుకోవాలని కోరతామని అక్బర్ చెబుతున్నారు. -
పార్లమెంటరీ కార్యదర్శులకు మంగళం
- నియామకం, భత్యాల జీవోల ఉపసంహరణ - గత నెల 23నే మెమో జారీ చేసినట్లు హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ - కోర్టు ధిక్కరణ పిటిషన్ను పరిష్కరించిన ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం మంగళం పాడింది. వారి నియామకపు జీవోతో పాటు వారికి పలు భత్యాలను మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోను సైతం ఉపసంహరించుకున్నామని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు గత నెల 23న సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వికాస్ రాజ్ పేరు మీద జారీ అయిన మెమోను ఆయన కోర్టుకు చూపారు. పరిశీలించిన హైకోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి తదితరులపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను పరిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు ధర్మాసనం, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం చట్ట విరుద్ధమని గత నెల 1న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందంటూ గుత్తా సుఖేందర్రెడ్డి వారిపై కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయగా శుక్రవారం ధర్మాసనం విచారించింది.