మాకు జనగామ జిల్లా కావాలి
లక్ష సంతకాల సేకరణకు కదిలిన సకల జనులు
కిలోమీటరు పొడవు బ్యానర్పై సంతకాలు చేసిన జనం
ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతారెడ్డి
జనగామ : సీఎం కేసీఆర్ గారు.. మాకు జనగామ జిల్లా కావాలి.. ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సిన బాధ్యత మీపై ఉంది.. జిల్లా చేస్తానని మీరిచ్చిన మాటనే నిలబెట్టు కోవాలి... మా జనగామలో జిల్లాకు కావల్సిన వనరులన్నీ ఉన్నాయంటూ తమ అభిప్రాయాలను బ్యానర్పై రాసి ఆకాంక్షను తెలిపారు. జనగామ జిల్లా కోసం జేఏసీ తలపెట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ప్రారంభించారు.
జాతీయ రహదారి అంబేద్కర్ విగ్రహం నుంచి నెహ్రూ పార్క్ వరకు కిలోమీటరు పొడవున ఏర్పాటు చేసిన తెల్లని బ్యానర్పై సకల జనులు సంతకాలు చేశారు. జనగామ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు, లింగాలఘణపురం, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, జర్నలిస్టులు, కార్మికులతో పాటు పలు పార్టీల నాయకులు సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉండగానే జేఏసీ సంతకాల సేకరణకు పిలునివ్వడంతో ఉత్కంఠ నెలకొంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్వచ్ఛందంగా వచ్చి బ్యానర్పై తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. శాంతియుతంగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు సంతకాల సేకరణ కొనసాగింది.
శాంతియుత ఉద్యమాలతో జిల్లా సాధించుకుంటాం
శాంతియుత ఉద్యమాలతో జనగామ జిల్లా సాధించుకుంటామని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. ఆర్టీసీ చౌరస్తాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అరెస్టులు చేసినా జిల్లా సాధించుకునే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీహెచ్.రాజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, ఓయూ జేఏసీ కన్వీనర్ బాలలక్ష్మి, జేఏసీ నాయకులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, పోకల లింగయ్య, ఆకుల వేణుగోపాల్రావు, ఆకుల సతీష్, మేడ శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా నాయకులు బాల్నె మహేందర్, మంగళ్లపల్లి రాజు, ఆలేటి సిద్దిరాములు, ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఎండీ అన్వర్, పిట్టల సత్యం పాల్గొన్నారు.