ఇద్దరుమిత్రులు: శంకరీం
తపాలా: అది 1981వ సంవత్సరం. హైదరాబాద్, మౌలాలిలో రైల్వే సర్వీస్ కమిషన్ ట్రైనింగ్ పూర్తయ్యాక నన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. ఎంత తిరిగినా రూమ్ దొరకలేదు. కొందరు బ్రహ్మచారులకి లేదంటే, మరికొందరు ముస్లింలకు లేదంటున్నారు. యూనియన్ ఆఫీస్లో పడుకోవటం ఇబ్బందే! డ్యూటీ అయిపోగానే, శంకర్ విలాస్లో భోజనం ముగించుకొని, గుంటూరు వీధుల్లో వేట!
అలా ఒకరోజు బ్రాడీపేటలో రవి కళాశాల (సి.వి.ధన్గారి మెడికల్ కోచింగ్ లేడీస్ హాస్టల్) ఎదురుగా, ‘రూమ్ అద్దెకివ్వబడును’ బోర్డు కనబడింది. డాబాపైన సింగిల్ రూమ్. బాగుంది. తిరిగి తిరిగి విసిగిపోవటం వల్ల, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రూమ్ వదులుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. ఇంటిగలావిడ వచ్చారు.
50-60 యేళ్లుంటాయి. ఇంటి పరిసరాలు ముందే హెచ్చరించాయి, సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబమనీ, రూమ్ దొరకటం అసాధ్యమనీ! అయినా మొండిగా, ‘‘పై రూమ్ అద్దెకిస్తారండి?’’ అని అడిగాను. ‘‘ఏం కులం?’’ ఆవిడ నోట జారి మొదటి ప్రశ్న. నా స్నేహితుడు శంకర్ను తలుచుకుని, తడబడకుండా చెప్పాను: ‘‘బ్రాహ్మలమండి’’. ‘‘తెగ?’’ ‘‘ఆరువేల నియోగులమండి’’. ‘‘మీదేవూరు? మీ నాన్నగారి పేరు?’’ ‘‘పిఠాపురమండి. మా నాన్నగారు డా॥కృష్ణమూర్తి గారండీ’’. ఆవిడకి ఎక్కడా అనుమానం రాలేదు. ఆవిడ చెప్పిన అద్దెకి మారుమాట్లాడకుండా ఒప్పేసుకొని, అడ్వాన్స్ ఇచ్చేసి, సాయంత్రానికల్లా రూమ్లో వాలిపోయాను. నా వేష భాషలతో నన్నెవరూ ముస్లిం అనుకోరు. పేరు చెప్పగానే మీరు ముస్లిమా అని ఆశ్చర్యపోతుంటారు. తెలుగు సాహితీ సాంస్కృతిక రంగంతో చిన్నప్పటినుండీ పరిచయం వలన నా తెలుగు ఉచ్ఛారణ అలా ఉందేమో!
అలా శంకర్గా మారి, ఆ రూమ్లో 8 నెలలు ఉన్నాను. ఇంట్లోవాళ్లందరూ అభిమానంగా చూసేవారు. పెళ్లి కాలేదని సంబంధాలు తెచ్చేవారు. అప్పట్లో సెల్ఫోన్లు లేకపోవటం వలన బతికిపోయాను. ‘‘మీ నాన్నగారిని ఓసారి రమ్మనవయ్యా’’ అని ఇంటావిడ తరచూ అడిగేవారు. ప్రాక్టీస్ బిజీగా ఉండటం వలన ఎక్కడికీ రాలేరని తప్పించుకునేవాడిని.
ఇక అసలు శంకర్ ఓసారి నాకోసం గుంటూరు వచ్చాడు. వాడికి స్టేషన్లోనే అన్ని విషయాలూ చెప్పి, ఇంటావిడకి వాణ్ని కరీంగా పరిచయం చేశాను. శంకర్ వెళ్లిపోయాక ‘‘తురకలతో స్నేహం ఏమిటయ్యా?’’ అన్నారావిడ. ‘‘లేదండి. వాడు చాలా మంచివా’’డని చెప్పాను. మళ్లీ గుంటూరు నుండి కాకినాడ ట్రాన్స్ఫర్ అయి, రూమ్ ఖాళీ చేసి వచ్చేస్తుంటే, ‘‘నువ్వు వెళ్లిపోతుంటే బాధగా ఉన్నా, సొంత ఊరికి సొంత మనుషుల మధ్యకి వెళ్తున్నావు. ఈ హోటల్ తిండి తప్పుతుందనే ఆనందంతో మా మనసులకి సర్దిచెప్పుకుంటున్నాం’’ అని వాళ్లంతా సాగనంపుతుంటే, ‘నేను బ్రాహ్మణ్ని కాను, ముస్లిం’నని చెప్పాలనే తలంపుని మదిలోనే దాచేసుకుని, వాళ్ల అభిమానాన్ని నా లగేజ్తో పాటు మోసుకుని, సర్కార్ ఎక్స్ప్రెస్లో కాకినాడ వచ్చేశాను.
కాకినాడలో నా డిగ్రీ అయింతర్వాత, నాన్నగారి ఉద్యోగరీత్యా పిఠాపురం వెళ్లాను. కొత్త ఊరు. స్నేహితులు లేరు. అప్పుడు శంకర్ పరిచయమయ్యాడు. నెమ్మదిగా మా స్నేహం బలపడింతర్వాత, రాత్రీపగలు కబుర్లు, సినిమాలు, షికార్లు, ఉద్యోగాన్వేషణలు! రెండు శరీరాలు- ఒక ప్రాణంలా బతికాం. ఎన్నో మధురక్షణాలు పంచుకున్నాం. నాకు ఉద్యోగం వచ్చి ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిపోతుంటే, వాడు ఆ రోజు మాధవస్వామి గుడి దగ్గర కూర్చుని చిన్నపిల్లాడిలా ఎంతగా ఏడ్చాడో, నేను ఇప్పటికీ మర్చిపోలేను. మా స్నేహంలాగే మా పేర్లను కూడా కలుపుకొని ‘శంకరీం’ అయ్యాం. అలాంటి నా ప్రాణమిత్రుడు శంకర్ మొన్న జూలైలో కిడ్నీలు ఫెయిలై ఈ లోకం నుండి వెళ్లిపోయాడు. ఇక, గుంటూరులో అప్పుడు నాకు రూమ్ అద్దెకిచ్చిన వాళ్ల పేర్లుగానీ, వివరాలుగానీ గుర్తులేవు. ముప్పై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా! ఆ బామ్మగారుగానీ, వారి బంధువులుగానీ ఇది చదివితే నన్ను క్షమించమని మనసారా కోరుకుంటూ... నా ప్రాణస్నేహితుడికి హృదయపూర్వక నివాళి అర్పించుకుంటూ...
- కరీం, కాకినాడ