క్షమాపణ చెప్పిన కేంద్రమంత్రి
తన వ్యక్తిగత సిబ్బంది ఓ సొసైటీ వాచ్మన్ను కొట్టడంతో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మ క్షమాపణలు చెప్పారు. రాఖీ రోజున తన సోదరి ఇంటికి వెళ్లినప్పుడు ఘజియాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాచ్మన్ను కొట్టిన తన వ్యక్తిగత భద్రతాధికారిని వెంటనే సస్పెండ్ చేసినట్లు మహేష్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా పోయింది. ఘజియాబాద్లోని ఆషియానా గ్రీన్స్ అనే సొసైటీ వాచ్మన్ను శర్మ సెక్యూరిటీ అధికారి కొడుతున్న దృశ్యాలను ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో పలువురు షేర్ చేశారు.
దీనిపై క్షమాపణ చెప్పిన కేంద్ర మంత్రి.. తన సెక్యూరిటీ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలను తాను ఎప్పుడూ సమర్థించబోనని, తనకు ఈ విషయం తెలియగానే ఎవరిది తప్పో తెలుసుకోడానికి ప్రయత్నించానని, విషయం తెలియగానే తన సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరానని చెప్పారు. వాళ్లిద్దరి మధ్య గొడవకు కారణం కూడా తనకు తెలియదని.. అది తెలుసుకుని, చర్య తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులదని అన్నారు. అయితే.. అకారణంగానే తనను కొట్టాడని వాచ్మన్ అజయ్ యాదవ్ చెప్పాడు.